
ప్రస్తుతం దేశంలో యూపీఐ ఛార్జీలపై రగడ నడుస్తోంది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం రూ.2,000 దాటిన చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ప్రాతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. UPI చెల్లింపులపై కొత్తగా GST భారం కూడా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.2,000కు మించిన UPI లావాదేవీలకు వర్తించే Merchant Discount Rate (MDR) ఛార్జీలపై 18 శాతం GST విధించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన UPI చెల్లింపులకు సంబంధించి వ్యాపారులు చెల్లించే MDR ఛార్జీలపై 18 శాతం GST విధించాల్సి రావచ్చని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ MDR చెల్లింపులపై వ్యాపారులు Input Tax Credit (ITC) పొందే అవకాశం ఉండటంతో మొత్తం పన్ను భారం కొంతవరకు తగ్గుతుందని వివరించారు.
ప్రభుత్వానికి భారీ ఆదాయం?
UPI లావాదేవీలపై MDRకు GST వర్తింపజేస్తే ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల వరకు GST ఆదాయం సమకూరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం UPI చెల్లింపులపై MDR విధానం, దానిపై GST వర్తింపు అంశం చర్చనీయాంశంగా మారింది. రూ.2,000కు మించిన లావాదేవీలపై ఈ విధానం అమల్లోకి వస్తే.. ముఖ్యంగా అధిక విలువైన డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులపై దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది.