Reading Time: 2 minutes
Ipl 2027 Auction Bcci Decides To Host Mini Auction In India

IPL 2027 Mini Auction in India: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2027 మినీ వేలాన్ని భారత్‌లోనే నిర్వహించాలని నిర్ణయించింది. మంగళవారం (సెప్టెంబర్ 15) జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలి సంవత్సరాల్లో ఐపీఎల్ వేలం విదేశాల్లో జరుగుతున్న నేపథ్యంలో.. ఈసారి మాత్రం వేదికను భారత్‌కు మార్చాలని బీసీసీఐ నిర్ణయించింది.

2023లో కొచ్చిలో జరిగిన వేలం తర్వాత ఐపీఎల్ వేలం వరుసగా విదేశీ వేదికల్లో జరిగింది. దుబాయ్, జెడ్డా, అబుదాబి వంటి నగరాలు వేలానికి ఆతిథ్యమిచ్చాయి. అయితే 2027 వేలం మినీ వేలం కావడంతో ఫ్రాంచైజీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో విదేశాలకు వెళ్లాల్సి రావడం వల్ల ఎదురయ్యే లాజిస్టికల్, నిర్వహణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత వేలం సందర్భంగా ఫ్రాంచైజీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను గవర్నింగ్ కౌన్సిల్ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.

అయితే ఐపీఎల్ 2027 వేలం ఏ నగరంలో జరుగుతుందో అనే దానిపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఫ్రాంచైజీలు, వారి ప్రతినిధులకు సరిపడే వసతి సౌకర్యాలు అందుబాటులో ఉండే నగరంను ఎంపిక చేయనున్నారు. ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు భారత్‌లో వివాహాల సీజన్ ఉండటంతో ఫైవ్ స్టార్ హోటళ్లలో గదుల లభ్యతను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. బీసీసీఐకి రెండు రోజుల పాటు 100కు పైగా గదులు అవసరమవుతాయని తెలుస్తోంది. హోటల్ అందుబాటును బట్టి వేలం జరిగే నగరాన్ని ఖరారు చేయనున్నారు.

ఐపీఎల్‌లో కొనసాగుతున్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. నెల రోజుల్లో మరో గవర్నింగ్ కౌన్సిల్ భేటీ జరగనుండగా.. అప్పుడే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ భవిష్యత్తుపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై ఫ్రాంచైజీల నుంచి బీసీసీఐ ఇప్పటికే అభిప్రాయాలను కోరింది. చాలా జట్లు ఈ నిబంధనకు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. అయితే మరో ఏడాది ఈ నిబంధనను కొనసాగించాలని కొన్ని ఫ్రాంచైజీలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను దృష్టిలో ఉంచుకునే తాము జట్లను నిర్మించామని కొన్ని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. అందుకే ఒక్కసారిగా ఈ నిబంధనను తొలగించడం కంటే.. వచ్చే ఏడాది నిర్ణయం తీసుకోవడం సరైనదని భావిస్తున్నారట.