
ఒప్పో వినియోగదారుల కోసం కంపెనీ తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అయిన కలర్ఓఎస్ 17ను అధికారికంగా విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 17 ఆధారంగా రూపొందించిన ఈ లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఫోన్ లుక్, స్పీడ్, రోజువారీ పనులను సులభతరం చేసే ఎన్నో అద్భుతమైన మార్పులను తీసుకువచ్చారు.
కలర్ఓఎస్ 17లో అత్యంత ముఖ్యమైన మార్పుగా ‘ఫ్లూయిడ్ డిజైన్’ను పరిచయం చేశారు. దీని ప్రధాన ఉద్దేశం ఫోన్ వాడుతున్నప్పుడు స్క్రీన్ పై జరిగే యానిమేషన్లు, మార్పులు మరింత స్మూత్గా, నేచురల్గా ఉండేలా చూడటం. ఒక యాప్ నుంచి మరో యాప్కు మారేటప్పుడు లేదా స్క్రీన్ను టచ్ చేసేటప్పుడు వేగం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ యాప్ మేనేజ్మెంట్ మెరుగ్గా ఉండటం వల్ల పాత యాప్లు మళ్లీ రీలోడ్ కాకుండా సజావుగా పనిచేస్తాయి.
ఈ కొత్త అప్డేట్లో కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని భారీగా పెంచారు. ఫొటో ఎడిటింగ్ కోసం ప్రత్యేకంగా ‘AI ఫోటో ఎడిటర్’ను అందించారు. దీని ద్వారా ఫొటోల్లోని మనకు అవసరం లేని వస్తువులను తొలగించడం, నాణ్యతను మెరుగుపరచడం సులభమవుతుంది. అలాగే నోట్స్ రాసుకునే వారి కోసం ‘AI నోట్స్’ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇది పెద్ద సమాచారాన్ని చిన్న సారాంశంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇవే కాకుండా స్క్రీన్పై ఉన్న పెద్ద టెక్స్ట్ను చదివి వినిపించే ‘స్మార్ట్ స్క్రీన్ రీడింగ్’ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
చైనాలో అక్టోబర్ 8 నుంచి ఈ స్టేబుల్ అప్డేట్ రోల్అవుట్ ప్రారంభం కానుంది. తొలి విడతగా ఒప్పో ఫైండ్ ఎన్6, ఫైండ్ ఎక్స్9 సిరీస్, వన్ప్లస్ 15 వంటి మోడళ్లకు ఈ అప్డేట్ లభిస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 16 నుంచి మరికొన్ని డివైజ్లకు, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇతర పాత ఫోన్లు, టాబ్లెట్లకు ఈ అప్డేట్ క్రమంగా అందజేయబడుతుంది. భారత్ తో పాటు ఇతర దేశాల కోసం ప్రత్యేక షెడ్యూల్ త్వరలో వెలువడనుంది.