
Pakistan: పాకిస్తాన్ సైన్యం, అమెరికాకు చెందిన డ్రోన్ కంపెనీ ‘పవరస్’’తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. డ్రోన్లకు సంబంధించిన ఆర్డర్లతో పాటు, ఎంఓయూ కుదుర్చుకున్నట్లు పవరస్ కో ఫౌండర్ బ్రెట్ వెలికోవిచ్ తెలిపారు. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ కంపెనీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్తో సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ కుమారుకుల పెట్టుబడులు కలిగిన ఆరియస్ గ్రీన్వే హోల్డింగ్స్ అనే కంపెనీలో త్వరలో పవరస్ విలీనం కాబోతోంది. విలీనం తర్వాత ఏర్పడే కంపెనీలో వీరికి 9.9 బెనిఫిషియల్ ఓనర్షిఫ్ వాటా కలిగి ఉండే అవకాశం ఉంది. అక్టోబర్ ప్రారంభంలో ఈ రెండు కంపెనీల విలీనం కాబోతున్నాయి.
పవరస్ ప్రతినిధులు బృందం బ్రెట్ వెలికోవిచ్ నేతృత్వంలో పాక్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్తో సమావేశమైనట్లు పాక్ సైన్యం ప్రకటించింది. ఈ భేటీలో రక్షణ కొనుగోళ్లు, ఉత్పత్తి, దీర్ఘకాలిక రక్షణ సామర్థ్యాల పెంపు వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు పాక్ తెలిపింది. పవరస్ సీఈఓ ఆండ్రూ ఫాక్స్ ప్రకారం.. పాకిస్తాన్ ప్రైవేట్ రక్షణ రంగం ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, అమెరికా కంపెనీ అక్కడ వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అమెరికా-పాకిస్తాన్ సాంకేతిక సామర్థ్యాలతో జాయింట్ టెక్నికల్ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని పవరస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, పవరస్ వ్యాపార విస్తరణలో ట్రంప్ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని సీఈఓ ఆండ్రూ పాక్స్ తెలిపారు. ఒప్పందాలు వ్యాపార ప్రాతిపదికన, మెరిట్ ఆధారంగా లభిస్తాయని చెప్పారు. ట్రంప్ జూనియర్ ఒక పాసివ్ ఇన్వెస్టర్ మాత్రమే అని తెలిపారు. ఇదిలా ఉంటే, ఈ ఒప్పందాన్ని అమెరికా, పాకిస్తాన్ మధ్య రక్షణ సంబంధాల బలోపేతానికి ఉపయోగపడుతుందని అసిమ్ మునీర్ ప్రశంసిొంచారు.