Reading Time: 2 minutes
Tollywood Movies Postponed 418 Hanuman Ansh And Anumana Pakshi Delayed

Tollywood Movies Postponed: టాలీవుడ్‌లో సినిమాల రిలీజ్ డేట్స్ ఎప్పుడు మారుతాయో చెప్పడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు వాయిదా పడటం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ ప్రభావం చిన్న, మధ్య తరహా బడ్జెట్ సినిమాలపైనా కనపడుతోంది. రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా చివరి నిమిషంలో సినిమాలు పోస్ట్‌పోన్ అవుతున్నాయి. ఈ వారం కూడా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమాలు బాక్సాఫీస్ రేసు నుంచి తప్పుకున్నాయి.

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్న సినిమా ‘418’. మైత్రీ మూవీ మేకర్స్ హారర్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి చిత్రంగా దీనిపై ఆసక్తి నెలకొంది. చైత్ర జె. ఆచార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ప్రశాంత్ నీల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కీర్తన్ నాదగౌడ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.సెప్టెంబర్ 18న సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకు ప్రకటించారు. అయితే రిలీజ్‌కు కొద్దిరోజుల ముందు సినిమా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా మరింతగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

మరోవైపు బాలీవుడ్‌లో ఇటీవల సంచలన విజయాన్ని అందుకున్న ‘హనుమాన్ అంశ్’ కూడా ఈ శుక్రవారం తెలుగులో విడుదల కావాల్సి ఉంది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా డాక్టర్ విశాల్ చతుర్వేది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శోభినవ్ సత్య ప్రధాన పాత్రలో నటించారు. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా హిందీలో పాజిటివ్ మౌత్ టాక్‌తో భారీ వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్‌లో వచ్చిన స్పందనతో ఓవర్సీస్‌లోనూ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను విడుదల చేసింది. అయితే తెలుగులో ఈ సినిమాను విడుదల చేసే బాధ్యతను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు చెందిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తీసుకుంది. సెప్టెంబర్ 18న తెలుగు వెర్షన్‌ను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఇదివరకు ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో తెలుగు రిలీజ్ వాయిదా పడింది. తెలుగు డబ్బింగ్ పనులు పూర్తికాకపోవడం, సెన్సార్ వంటి అంశాలు ఈ ఆలస్యానికి కారణమని సినీ వర్గాల్లో టాక్. అయితే కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఈ లిస్ట్ లో మరో సినిమా “అనుమాన పక్షి” కూడా చేరింది. సెన్సార్ సంబంధింత వ్యవహారాల్లో జరిగిన ఆలశ్యం కారణంగానే ఈ సినిమా కూడా వాయిదా పడింది. ఈ సినిమాలు పోస్ట్‌పోన్ కావడంతో ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీ కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ పాట కోరిన వారు’, ‘హ్యాపీ జర్నీ’ వంటి సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.