
కల్లు తయారీలో అక్రమంగా వినియోగించే ప్రమాదకర మత్తు పదార్థం అల్ఫాజోలం అక్రమ రవాణాపై సైబరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఉక్కుపాదం మోపింది. గండిపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల ప్రాంతంలో నిర్వహించిన మెరుపు తనిఖీల్లో భారీగా అల్ఫాజోలంతో పాటు వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.
దాడుల వివరాలు , అరెస్టులు
మెదక్, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన వ్యక్తులకు పెద్ద ఎత్తున అల్ఫాజోలం విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో సైబరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ బృందం రంగంలోకి దిగింది. మంచిరేవుల వద్ద జరిపిన తనిఖీల్లో వ్యాగనార్ కారులో 751 గ్రాముల అల్ఫాజోలంతో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను మొదట అదుపులోకి తీసుకున్నారు. అదే ప్రాంతంలో జరిపిన మరొక తనిఖీలో ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరి వద్ద నుంచి 1.18 కేజీల అల్ఫాజోలాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా అధికారులు ఈ దాడుల్లో 1.931 కేజీల అల్ఫాజోలం, ఒక కారు, ద్విచక్రవాహనం , మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన అల్ఫాజోలం , వాహనాల మొత్తం విలువ దాదాపు రూ. 24.18 లక్షలు ఉంటుందని సైబరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి. శ్రీనివాసరెడ్డి తెలిపారు.
నిందితుల గుర్తింపు , కేసు నమోదు
ఈ కేసులో మెదక్, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన లింగరాజు గౌడ్, టి. ఆంజనేయులు, ఆర్. రమేష్, కాటమయ్యలను అధికారులు అరెస్ట్ చేశారు. వీరికి అల్ఫాజోలాన్ని సరఫరా చేసిన ప్రధాన సూత్రధారులైన మరో ఇద్దరిపై కూడా కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేశారు. పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న పదార్థాలు , వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం గండిపేట ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు.
అధికారుల హెచ్చరిక , అభినందనలు
ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కల్లు తయారీకి లేదా ఇతర అక్రమ అవసరాలకు అల్ఫాజోలాన్ని తీసుకువచ్చినా, దానితో కల్లు తయారుచేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సైబరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సూర కృష్ణ, ఎస్సై రమేష్, ట్రైనీ ఎస్సైలు రమణ, రమేష్, గిరి , హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్, కానిస్టేబుల్స్ పెంటారెడ్డి, సాయికుమార్, శ్యామ్, శిల్ప, జయలక్ష్మి, శోభలతో కూడిన బృందం అత్యంత సమర్థవంతంగా ఈ తనిఖీలు నిర్వహించి అల్ఫాజోలాన్ని పట్టుకుంది. చాకచక్యంగా వ్యవహరించి ముఠాను పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి, జాయింట్ కమిషనర్ అంజన్ రావు, సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ జై హరి కిషన్ ప్రత్యేకంగా అభినందించారు.