
దిల్ సుఖ్ నగర్, వెలుగు: దిల్సుఖ్నగర్లోని బహార్ బిర్యానీ కేఫ్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఏకంగా 50 కిలోల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేఫ్లో నిల్వ ఉంచిన చికెన్, మటన్, రొయ్యలతో పాటు గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు. వంటకాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార నమూనాలను సేకరించిన అధికారులు, నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను కేఫ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్లు తెలిపారు.
9 హోటళ్ల లైసెన్సులు రద్దు
హైదరాబాద్, వెలుగు: ఎల్బీనగర్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన పది స్పెషల్ టీంలు బుధవారం తనిఖీలు చేపట్టాయి. అపరిశుభ్రత, కుళ్లిన మాంసం, బొద్దింకలు, ఎలుకల సంచారం, సింథటిక్ రంగులు, కాలం చెల్లిన ఆహార పదార్థాల వాడకం బయటపడింది. ఉల్లంఘనలకు పాల్పడిన 9 సంస్థల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని మరో 7 సంస్థలకు జరిమానా విధించేందుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నలుగురికి ఇంప్రూమెంట్ నోటీసులు ఇచ్చారు.