Reading Time: 2 minutes
Pns Hunain Collision Did Pakistan Navy Use A Chinese Maritime Playbook Against India

Pakistan: అరేబియా సముద్రంలో పాకిస్తాన్ నేవీ, భారత నేవీని కవ్వించే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ నేవీకి చెందిన పీఎన్ఎస్ హునైన్, భారత నేవీకి చెందిన కోల్‌కతా క్లాస్ డిస్ట్రాయర్‌కు అత్యంత సమీపంలోకి వచ్చి, ఢీకొట్టింది. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందిస్తూ.. పాక్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 15న అంతర్జాతీయ జలాల్లో, గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌కు సుమారు 120 నాటికన్ మైళ్ల దూరంలో భారత్ యుద్ధనౌక సాధారణ మిషన్‌లో ఉండగా ఈ ఘటన జ రిగింది. పాకిస్తాన్ నౌక దెబ్బతినగా, భారత్ నౌకకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

చైనా ‘‘వ్యూహాలు’’ అమలు..

ఈ ఘటన అనుకోకుండా జరిగింది కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఘటనను దక్షిణ చైనా సముద్రంలో చైనా నేవీ, కోస్ట్ గార్డు, మారిటైమ్ మిలీషియా అనుసరిస్తున్న వ్యూహాలను గుర్తుకు తెస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, ఫిలిప్పీన్స్ జలాల్లో చైనా గతంలో ఇలాంటి ఘటనలకే పాల్పడింది.

ఇతర దేశాల నౌకలపైకి చైనా నౌకలు వెళ్లడం, వాటికి అడ్డుతగలడం, వాటి మార్గాలను కట్ చేయడం వంటి ఘటనలకు పాల్పడింది. ఇప్పుడు పాక్ నేవీకి చెందిన హునైన్ కూడా ఇలాంటి ఘటనకే పాల్పడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ నేవీ చైనా తయారీ యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు పెద్ద సంఖ్యలు ఉపయోగిస్తోంది. ఇరు దేశాలు తరుచుగా జాయింట్ నేవీ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.

పాక్ యుద్ధనౌక డ్యామేజ్..

ఈ ఘటనలో పాకిస్తా్న్ యుద్ధనౌక దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. భారత కోల్‌కతా క్లాస్ డిస్ట్రాయర్ బరువు 7000 టన్నులకు పైగా ఉంటుంది. పాక్ నేవీకి చెందిన పీఎన్ఎస్ హునైన్ సుమారు 2600 టన్నులు ఉండే ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసల్. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న నౌకలకే ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ మరింత వేగంగా ఢీకొని ఉంటే పాకిస్తాన్ నౌక మునిగిపోయేదని విశ్లేషకులు చెబుతున్నారు.

భారత్, పాకిస్థాన్ నౌకాదళాల మధ్య ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు 1991లో ఒక ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ జలాల్లో ఇరు దేశాల నౌకలు ఒకదానికొకటి మూడు నాటికల్ మైళ్ల కంటే దగ్గరగా వెళ్లకూడదని అందులో ఉంది. అయితే, పాకిస్తాన్ మాత్రం తమను రెచ్చగొట్టే విధంగా భారత్ నౌకనే దగ్గరగా వచ్చిందని పేర్కొంది. ఇది 1991 ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని ఆరోపించింది. 2011లో గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో పాకిస్థాన్ నేవీకి చెందిన పీఎన్ఎస్ బాబర్, భారత నేవీ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ గోదావరి మధ్య ఢీకొన్న ఘటన జరిగింది.