
Assembly Protest: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి దివ్యాంగులు ప్రయత్నించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ నుంచి అసెంబ్లీ వైపు ర్యాలీగా బయలుదేరిన దివ్యాంగులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తదితరుల ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. గన్పార్క్ చేరకముందే పోలీసులు వారిని నిలువరించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యంగా పెన్షన్, రుణాలు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ఉచిత రవాణా వంటి అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్ హామీని ప్రకటించింది. ఎలాంటి గ్యారంటీ లేకుండా దివ్యాంగులకు రూ.5 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఇల్లు లేని దివ్యాంగులకు ఇళ్ల నిర్మాణం, బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి వారి సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు.
ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు పలు హామీలు ఇచ్చిందని పాయల్ శంకర్ ఆరోపించారు. అయితే వాటిలో అనేకం అమలు కాలేదని విమర్శించారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా దివ్యాంగులతో కలిసి అసెంబ్లీ వైపు ర్యాలీగా వస్తున్న పాయల్ శంకర్ను పోలీసులు అడ్డుకున్నారు. దివ్యాంగులను అసెంబ్లీ వైపు అనుమతించకుండా నిలువరించగా.. ఎమ్మెల్యేలను మాత్రం లోపలికి అనుమతించినట్లు బీజేపీ నేతలు తెలిపారు. పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను అడ్డుకున్నారు.
దివ్యాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని పాయల్ శంకర్ ఆరోపించారు. కేవలం సంక్షేమ పథకాలు అమలు చేయడం సరిపోదని.. దివ్యాంగులకు ఉపాధి, ఆర్థిక స్వావలంబన, రవాణా, విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కేటగిరీలో లక్షలాది మంది ఆసరా లబ్ధిదారులు నమోదై ఉన్నారు. దివ్యాంగుల సమస్యలపై రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో.. తమకు సంబంధించిన మిగిలిన హామీలు, డిమాండ్లను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆందోళనకారులు కోరుతున్నారు.