Reading Time: < 1 minute
ఇల్లు లేని కుటుంబాలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 2029 నాటికి అర్హులైన ప్రతి కుటుంబానికి సురక్షితమైన, శాశ్వతమైన ఇల్లు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ‘హౌసింగ్ ఫర్ ఆల్’ కార్యక్రమాన్ని సంతృప్తి స్థాయిలో అమలు చేయాలని స్పష్టం చేశారు.

గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, పీఎం జన్‌మన్ సహా వివిధ పథకాల కింద చేపట్టాల్సిన ఇళ్ల నిర్మాణాలను వచ్చే నెలలోగా గ్రౌండింగ్ చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో మరో 1.5 లక్షల ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

డిసెంబర్ 2026 నాటికి 2.05 లక్షల ఇళ్లు, 2027 మార్చి నాటికి మరో 2.74 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యాలను నిర్దేశించారు. రాష్ట్రంలో పీఎంఏవై 1.0, పీఎంఏవై 2.0, పీఎం జన్‌మన్ పథకాల కింద 18.72 లక్షల ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 13.20 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో 16.11 లక్షల ఇళ్లకు గాను 11.31 లక్షలు, ఏపీ టిడ్కో పరిధిలో 2.61 లక్షల ఇళ్లకు గాను 1.88 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి.

ఇంటి స్థలాలు లేని కుటుంబాలను గుర్తించేందుకు ఆర్టీజీఎస్, ఆవాస్ ప్లస్, హౌసింగ్, రెవెన్యూ శాఖల డేటాను అనుసంధానం చేసి డూప్లికేషన్ లేకుండా అర్హులను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో జాబితాలను ప్రచురించి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం తుది జాబితాలను ఖరారు చేయాలని సూచించారు. ఇక కేంద్ర సహకారంతో శ్రీసిటీ సహా పారిశ్రామిక ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ల ఏర్పాటుపైనా దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు. ఏపీఐఐసీతో సమన్వయం చేసుకుని ఈ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..