Reading Time: 2 minutes
Hyderabad Liberation Day Vice President Radhakrishnan Pays Tribute To Sardar Patel

Vice President Radhakrishnan: హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉండటం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ అన్నారు. హైదరాబాద్ సంస్థానం విమోచన, భారతదేశంలో విలీనం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌరవించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

హైదరాబాద్ విమోచన పోరాటంలోని మరుగునపడిన వీరుల కథలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ పోరాటం కేవలం ప్రభుత్వాలు లేదా ప్రముఖ నాయకులకు సంబంధించినది కాదని.. ఇది ప్రజా ఉద్యమమని అన్నారు. విద్యార్థులు, మేధావులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ కార్యకర్తలు, రైతులు, సామాన్య ప్రజలు ఇందులో పాల్గొన్నారని గుర్తుచేశారు. అనేక మంది జైలు శిక్షలు, హింస, వ్యక్తిగత ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపారు.

రాంజీ గోండ్, తుర్రేబాజ్ ఖాన్, కొమురం భీమ్ తదితర వీరుల త్యాగాలను జాతీయ స్మృతిలో గుర్తుంచుకోవాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. చరిత్రను కేవలం ప్రభుత్వ కార్యాలయాలు లేదా ప్రముఖ నాయకులు మాత్రమే నిర్మించరని.. సామాన్య ప్రజల త్యాగాలు కూడా చరిత్రను నిర్మిస్తాయని అన్నారు.

స్వతంత్ర భారతదేశ ఏకీకరణలో భారతరత్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని రాధాకృష్ణన్ అన్నారు. బలమైన, ఏకీకృత భారతదేశానికి పటేల్ దృఢమైన పునాది వేశారని పేర్కొన్నారు. అసాధ్యంగా కనిపించిన హైదరాబాద్ ఏకీకరణను ఆయన సుసాధ్యం చేశారని కొనియాడారు. హైదరాబాద్ ప్రజలు రజాకార్లకు వ్యతిరేకంగా చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి అపారమని అన్నారు. హైదరాబాద్ విమోచన పోరాటంలో పాల్గొన్న యోధులకు, సర్దార్ పటేల్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర ప్రాంతాల్లో నక్సలిజాన్ని ఎదుర్కొనడంలో కేంద్ర బలగాలు కీలకంగా పనిచేశాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులతో సమన్వయంతో కేంద్ర సాయుధ బలగాలు వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేశాయని తెలిపారు. నక్సల్ రహిత, సురక్షిత, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంతో కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతకు కేంద్ర బలగాలు నిరంతరం కాపలాదారులుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం తగ్గిన తర్వాత ఆరోగ్యం, విద్య రంగాల్లో మార్పులు కనిపిస్తున్నాయని.. ముప్పు తగ్గడంతో గతంలో అస్థిరతకు గురైన ప్రాంతాల్లో శాంతి, అభివృద్ధి, అవకాశాలు పెరుగుతున్నాయని వివరించారు.

రాజకీయ విలీనం భూభాగాలను ఏకం చేస్తే.. రాజ్యాంగ ప్రజాస్వామ్యం ప్రజలను ఏకం చేస్తుందని రాధాకృష్ణన్ అన్నారు. జాతీయ ఐక్యత కేవలం భౌగోళిక సరిహద్దులపై ఆధారపడి ఉండదని తెలిపారు. ప్రతి భారతీయుడికి సమాన హక్కులు, సమాన గౌరవం, సమాన అవకాశాలు కల్పించినప్పుడే జాతీయ ఐక్యత మరింత బలపడుతుందని పేర్కొన్నారు. భిన్న భాషలు మాట్లాడినా, భిన్న సంప్రదాయాలు పాటించినా, భిన్నంగా పూజలు చేసినా భారతీయులంతా రాజ్యాంగం, సార్వభౌమత్వ భావనతో ఒక్కటిగా ఉంటారని అన్నారు. మన సార్వభౌమత్వానికి అసలు అధికారం ప్రజలదేనని స్పష్టం చేశారు.

2022 నుంచి హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నామని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. దేశ ఐక్యతను మరింత బలోపేతం చేయడానికి ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ‘‘భారత్ ఒక్కటే.. భారత్ ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంది. ఇదే సర్దార్ పటేల్‌కు మనం అందించే నిజమైన నివాళి’’ అని ఉపరాష్ట్రపతి అన్నారు.