Reading Time: < 1 minute
నందిగ్రామ్‌ ఉప ఎన్నికల బరిలో బీజేపీ బిగ్ ట్విస్ట్..! ముఖ్యమంత్రి మాజీ పీఏ తల్లికి టికెట్!

పశ్చిమ బెంగాల్‌లో అక్టోబర్ 6న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థులను ప్రకటించింది. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి హషీరామీ రథ్‌ను, రేజినగర్ నుంచి సఖారో సర్కార్‌ను బరిలోకి దింపింది. దీంతో రెండు నియోజకవర్గాల్లోనూ ఎన్నికల పోటీ ఆసక్తికరంగా మారింది.

నందిగ్రామ్ అభ్యర్థి హషీరామీ రథ్‌కు స్థానిక రాజకీయంగా ప్రత్యేక నేపథ్యం ఉంది. ఆమె ముఖ్యమంత్రి సువేందు అధికారి మాజీ వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ తల్లి. ఈ ఏడాది మే నెలలో చంద్రనాథ్ రథ్ హత్యకు గురయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం అప్పట్లో చర్చనీయాంశమైంది. సువేందు అధికారి సమక్షంలో హషీరామీ రథ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌కు ముందు నందిగ్రామ్‌లోని జానకినాథ్ ఆలయంలో ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

సువేందు అధికారి రెండు స్థానాల్లో విజయం సాధించిన అనంతరం నందిగ్రామ్ సీటుకు రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు, హుమాయున్ కబీర్ రాజీనామాతో రేజినగర్ స్థానం ఖాళీ అయింది. బీజేపీ ప్రకటనకు ముందు టీఎంసీ తిరుగుబాటు వర్గం కూడా అభ్యర్థులను ప్రకటించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వర్గం, కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ సైతం అభ్యర్థులను రంగంలోకి దింపాయి. అక్టోబర్ 6న పోలింగ్, అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..