
సూర్యాపేట జిల్లా కోదాడలో సెప్టెంబర్ 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవ్వగా కోదాడ, తుంగతుర్తి ఎమ్మెల్యేలు పద్మావతి రెడ్డి, మందులు శామ్యూల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ తదితరులు పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి, యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కోదాడ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ సీసీఆర్ విద్యానిలయంలో జరగనున్న ఈ మెగా జాబ్ మేళాలో ఏకంగా 300కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి.
విద్యార్హతలు, నైపుణ్యాలకు తగినట్లుగా వివిధ రంగాల్లో కొలువులు సాధించే గొప్ప అవకాశం లభిస్తోందని, జిల్లాలోని నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
►ALSO READ | PLSQL డెవలపర్ ఖాళీలు.. బీటెక్ స్టూడెంట్స్కు అవకాశం