
సంచలన ఫీచర్లు , అధునాతన టెక్నాలజీతో కూడిన శామ్సంగ్ లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ల కొనుగోలును మరింత సులభతరం చేసేందుకు కంపెనీ భారత్లో ఆకర్షణీయమైన కొత్త ఫైనాన్సింగ్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ అల్ట్రా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 మోడళ్ల కొనుగోలు కోసం ఈ ఫ్లెక్సిబుల్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా రెండు బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా 24 నెలల ‘గెలాక్సీ ఫొరెవర్’ ప్రోగ్రామ్ను, అలాగే మూడు మోడళ్లను కవర్ చేసేలా 30 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్ను శామ్సంగ్ అందిస్తోంది.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా, ఫోల్డ్ 8 మోడళ్ల కోసం కొనుగోలుదారులు 24 నెలల గెలాక్సీ ఫొరెవర్ ప్లాన్ ద్వారా డబ్బులు పే చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ కింద జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా నెలవారీ చెల్లింపు రూ. 9,417 నుంచి రూ. 6,997కి తగ్గగా, జెడ్ ఫోల్డ్ 8 నెలవారీ ఈఎంఐ రూ. 8,584 నుంచి రూ. 6,416కి తగ్గింది. ఈ ఈఎంఐలో ఫోన్ ధరలో 60 శాతం భాగం , ప్రోగ్రామ్ ఫీజు కలిసి ఉంటాయి. మిగిలిన 40 శాతం మొత్తాన్ని 24 నెలల తర్వాత ఒకేసారి (బుల్లెట్ పేమెంట్) చెల్లించాల్సి ఉంటుంది.
నిర్దిష్ట కాలపరిమితి ముగిసిన తర్వాత వినియోగదారులు పాత ఫోన్ను తిరిగి ఇచ్చి కొత్త గెలాక్సీ మోడల్కు అప్గ్రేడ్ అవ్వవచ్చు, లేదా మిగిలిన 40 శాతం చెల్లించి ఫోన్ను తమ దగ్గరే ఉంచుకోవచ్చు. ఒకవేళ 10 నుంచి 11 నెలల్లోపు వాపసు ఇస్తే 55 శాతం వరకు, 12-13 నెలల్లో 50 శాతం, 14-18 నెలల్లో 45 శాతం, 19-25 నెలల్లో వాపసు ఇస్తే 40 శాతం వరకు బైబ్యాక్ వాల్యూ లభిస్తుంది. అంతేకాకుండా.. గెలాక్సీ ఫొరెవర్ ప్రోగ్రామ్లో శామ్సంగ్ కేర్ ప్లస్ కూడా లభిస్తుంది, ఇది ఎలాంటి క్లైమ్ ప్రాసెసింగ్ ఫీజు లేకుండా యాక్సిడెంటల్, లిక్విడ్ డ్యామేజ్ను కవర్ చేస్తుంది. ధరల విషయానికి వస్తే.. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ప్రారంభ ధర రూ. 1,79,999 నుంచి రూ. 2,39,999 వరకు ఉండగా, జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా ధర రూ. 1,99,999 నుంచి రూ. 2,59,999 వరకు ఉంది.