
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలలో వస్తున్న జనాభా పెరుగుదల, ఇతర పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరపాలక సంస్థ పరిధిని, పాలనా సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ముందడుగు పడింది. తిరుపతి నగరపాలక సంస్థలో ఇప్పటివరకు ఉన్న వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం తాజాగా అధికారికంగా ఆమోదముద్ర వేసింది.
గతంలో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 50 వార్డులు మాత్రమే ఉండేవి. అయితే నగరంలో పెరిగిన జనసాంద్రత, విస్తరిస్తున్న కాలనీలు, మున్సిపల్ సేవల్లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని వార్డుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. దీని ప్రకారం 50 వార్డులుగా ఉన్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ను ఏకంగా 66 వార్డులుగా పునర్విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వార్డుల పెంపు , పునర్విభజన ప్రక్రియ గత కొంతకాలంగా వివిధ దశల్లో కొనసాగుతూ వచ్చింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 4వ తేదీన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (CDMA) దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం స్థానిక ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు, సలహాలను స్వీకరించడానికి సెప్టెంబర్ 11వ తేదీ వరకు గడువు విధించారు.
నిర్దేశిత గడువులోగా వచ్చిన విజ్ఞప్తులు, అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, వార్డుల విభజన ప్రక్రియను పూర్తి చేసి తుది నివేదికను మున్సిపల్ అండ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు అందజేశారు. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం, అన్ని అంశాలను బేరీజు వేసుకుని మంగళవారం సాయంత్రం వార్డుల పెంపునకు తుది ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ఆమోదం లభించిన విషయాన్ని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ అధికారికంగా వెల్లడించారు. వార్డుల పెంపుతో భవిష్యత్తులో నగరంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావడంతో పాటు, ప్రజలకు మెరుగైన పాలనా సంక్షేమ ఫలాలు అందుతాయని అధికారులు భావిస్తున్నారు.