
KTR: హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. 22ఏ భూముల వ్యవహారం, కేసీఆర్ ఫామ్హౌస్ భూములు, కరెంట్, ఉద్యోగాలు, ప్రభుత్వ హామీల అమలు వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 22ఏ భూముల వ్యవహారంపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని మరోసారి డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో సుమారు రెండు గంటల పాటు ఏం మాట్లాడారో ఎవరికీ అర్థం కాలేదని కేటీఆర్ విమర్శించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తాను చెప్పిన మాటలను కూడా వక్రీకరించి చూపించారని అన్నారు. 1000 రోజుల పాలన వైఫల్యాలపై చర్చ జరగకుండా డైవర్షన్ చేసేందుకే కేసీఆర్ కుటుంబ భూముల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని కేటీఆర్ ఆరోపించారు.
22A నిషేధిత భూముల జాబితాలో ప్రైవేట్ ఆస్తులను చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 30% కమీషన్ల కోసమే 22A అంశాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. లక్షలాది కుటుంబాలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నాయని, తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు తెలంగాణ భవన్కు వస్తున్నారని తెలిపారు. 22A భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ ఇప్పటికే న్యాయ విచారణ కోరింది. తప్పుగా నిషేధిత జాబితాలో చేర్చిన భూములను తొలగించి, బాధితులకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు.
22A పేరుతో వేల కోట్ల రూపాయలు దండుకోవడానికే ఈ విధానం తీసుకొచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం తమ తప్పును అంగీకరించి, బాధితులకు న్యాయం చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. ‘మమ్మల్ని ఎంత విమర్శించినా ప్రజలు క్షమిస్తారు.. కానీ కేసీఆర్ను విమర్శిస్తే ప్రజలు క్షమిస్తారా?’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫామ్హౌస్ భూములపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కేటీఆర్ స్పందించారు. గతంలో రేవంత్ రెడ్డి వెయ్యి ఎకరాల ఫామ్హౌస్ అని పదేపదే చెప్పారని, ఇప్పుడు అసెంబ్లీలో 67 ఎకరాల గురించి మాట్లాడారని ప్రశ్నించారు.
కేసీఆర్ వ్యవసాయం చేయడం కొత్త విషయం కాదని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కుటుంబం గతంలో వ్యవసాయంతో అనుబంధం కలిగిన కుటుంబమని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ వ్యవసాయం చేశారని పేర్కొన్నారు. భూములను ఆట వస్తువులుగా చూడలేదని అన్నారు. కేసీఆర్ భూములపై అసెంబ్లీలో చెప్పిన వివరాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, 933 ఎకరాల భూమి ఎక్కడ ఉందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో చూపించిన భూముల వివరాలే ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్పై ఆరోపణలు చేసే ముందు ఆయన ఏం ప్రకటించారో చూడాలని అన్నారు. ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబానికి వివిధ జిల్లాల్లో కలిపి సుమారు 440 ఎకరాల భూములు ఉన్నాయని ఆరోపించారు. ఇందులో కేసీఆర్ దంపతులకు సుమారు 67 ఎకరాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. అసెంబ్లీ సమావేశాలను మరో నెల రోజులు పొడిగించి, భూముల వ్యవహారంపై సమగ్రంగా చర్చించాలని కోరారు. తప్పు ఎవరిదైనా తేల్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. తొలగించిన భూములు, నిషేధిత జాబితాలో చేర్చిన భూములపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంత మాత్రాన ఎవరికీ ప్రత్యేక అధికారాలు రావని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తప్పు చేసేది ప్రభుత్వం అయితే దానికి ప్రజలను బాధ్యులను చేయడం సరికాదన్నారు. ప్రజలు దరఖాస్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారని కేటీఆర్ గుర్తుచేశారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ అన్నారు. రైతులకు విద్యుత్ సమస్యలు ఉన్నాయని, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. కరెంట్ సమస్యపై అసెంబ్లీలో చర్చ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.