
మరికొద్దిరోజుల్లో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. సమాజ్వాదీ పార్టీ (SP) నేత పవన్ యాదవ్పై కాల్పులు జరిగాయి. ప్రయాగ్రాజ్లోని హండియా ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం. తీవ్రంగా గాయపడిన పవన్ యాదవ్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది.
పవన్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ ప్రయాగ్రాజ్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో గ్రామ సర్పంచ్గా కూడా బాధ్యతలు నిర్వర్తించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాల్పులకు కారణం, నిందితులెవరు, దాడి వెనుక ఉద్దేశం ఏమిటన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అఖిలేశ్ వ్యాఖ్యల తర్వాతే ఘటన
ఈ ఘటనకు రెండు వారాల ముందు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్థులు ఉత్తరప్రదేశ్లోకి వచ్చి నేరాలకు పాల్పడుతున్నారని, అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వారిని కాపాడుతోందని ఆరోపించారు. ఎక్స్లో చేసిన పోస్టులో అఖిలేశ్ యాదవ్.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రం నుంచి మాఫియా, నేరస్థులు వెళ్లిపోయారని చెబుతున్నారని, కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల నుంచి గ్యాంగ్స్టర్లు, నేరస్థులు ఉత్తరప్రదేశ్లోకి వచ్చి కాల్పులు, హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిని బీజేపీ ప్రభుత్వం రక్షిస్తోందని కూడా విమర్శించారు.
యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారు?
మరోవైపు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల రాష్ట్రంలో శాంతిభద్రతలు సహా పలు రంగాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. దేవరియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉత్తరప్రదేశ్ను పిలిచే ‘బిమారు’ రాష్ట్రం అనే ముద్ర ఇప్పుడు లేదన్నారు. ఆరోగ్యం, కనెక్టివిటీ, విద్య, శాంతిభద్రతల విషయంలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందిందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్కు ఇప్పుడు దేశంలో గౌరవప్రదమైన గుర్తింపు లభించిందని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే ఎస్పీ నేతపై కాల్పులు జరగడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులు, కాల్పులకు గల కారణాలపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.