Reading Time: < 1 minute
Telangana: ఇదేదో రాయి లేదా మట్టిముద్ద అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే స్టన్ అవుతారు..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అలనాటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, శాసనాలు కూడా ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. నల్లగొండ మండలం అప్పాజిపేట గ్రామంలో ఓ రైతు వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో మట్టి పెంకులు బయటపడ్డాయి. అయితే వాటిని సాధారణ మట్టి పెంకులుగా భావించి పక్కన పడేశారు.
అయితే చూడటానికి మట్టి ముద్దలా కనిపించినా.. ఈ అరుదైన టెర్రకోట వస్తువుగా చరిత్రకారులు గుర్తించారు. ఈ మట్టి పెంకులను పరిశీలించిన చరిత్రకారులు ఇది సాధారణ వస్తువు కాదని గుర్తించారు.

కుండలు.. మట్టి వస్తువులు.. ఆనాటి జీవితం.. తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్, సభ్యులు చిక్కుల యాదగిరి, మేక అశోక్ రెడ్డిలు అప్పాజీపేటను సందర్శించి ఈ మట్టి ముద్దలను పరిశీలించారు. శాతవాహనుల కాలానికి చెందినదిగా భావిస్తున్న ఈ డాబర్‌, అప్పటి ప్రజల జీవన విధానం, కుండల తయారీ వంటి సంప్రదాయాలకు సంబంధించిన కీలక ఆధారంగా చరిత్రకారులు భావిస్తున్నారు. అప్పట్లో కుండలు చేసే సమయంలో టెర్రకోట డాబర్ను లోపలివైపు పెట్టుకుని, పై నుంచి మరో చెక్కబద్దతో కొడుతు కుండకు ఆకారాన్ని ఇచ్చేవారని పేర్కొన్నారు. ఇటువంటివి గతంలో ఉత్తరప్రదేశ్‌లో లభించాయని చరిత్రకారులు చెబుతున్నారు. అవి క్రీ.పూ 200ల నుంచి క్రీ.శ.600 సంవత్సరాల నాటివని పేర్కొన్నారు.

ఇది మట్టి వస్తువు కాదు..నాటి నాగరికతకు సాక్ష్యం..

ఈ టెర్రకోట డాబర్‌పై మరింత శాస్త్రీయ పరిశోధన జరిగితే.. దాని కాలం, వినియోగం, తయారీ విధానం వంటి అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ టెర్రకోట వస్తువు లభించడం ద్వారా నల్లగొండ ప్రాంతంలో అప్పటి సామాజిక, ఆర్థిక జీవనంపై మరింత పరిశోధనకు అవకాశం ఏర్పడింది.

వ్యవసాయ భూముల్లో తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఇలాంటి పురాతన వస్తువులు బయటపడుతుండటంతో.. నల్లగొండ నేలలో ఇంకా ఎన్నో చారిత్రక ఆనవాళ్లు దాగి ఉండొచ్చన్న చరిత్రకారులు భావిస్తున్నారు.