
వినాయక నిమజ్జనం వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. గణనాధుడి నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన. బుధవారం ( సెప్టెంబర్ 16 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి… పెద్దకంజర్లలోని నేరెడుచెరువులో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతులంతా శిరీష చారిటబుల్ ట్రస్ట్లో చదువుతున్న విద్యార్థులుగా తెలుస్తోంది.
వినాయక చవితి ఉత్సవాల అనంతరం నిమజ్జనం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే విద్యార్థులు నీటిలో ఎలా దిగారు..? ప్రమాదానికి అసలు కారణం ఏమిటి..? ఒకేసారి ఎంతమంది నీటిలోకి వెళ్లారు..? వంటి అంశాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని… చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో పెద్దకంజర్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన తమ పిల్లలు తిరిగి వస్తారని ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఈ విషాద వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. విద్యార్థుల మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మృతుల వివరాలు:
- నర్సింహా రాజు, బిటేక్
- సుమంత్ , డిప్లమా సెకండ్ ఇయర్
- గణేష్, డిప్లమా సెకండ్ ఇయర్
- ఉదయ్ కిరణ్, డిప్లమా థర్డ్ ఇయర్
- శాముకుమార్, డిప్లమా ఫస్ట్ ఇయర్
- సిదర్థ్, టెంత్ క్లాస్
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిమజ్జన సమయంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? విద్యార్థులు చెరువు దగ్గరికి ఏ విధంగా చేరుకున్నారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
►ALSO READ | తల్లి, అక్క, బావ కలిసి చంపేసి వరి పొలంలో పాతిపెట్టారు.. కరీంనగర్ జిల్లాలో షాకింగ్ ఘటన