
Ram Charan-Om Raut Movie Rumors: స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా క్రేజీ కాంబినేషన్ల గురించి వార్తలు బయటకు వచ్చినప్పుడు అభిమానుల్లో ఆసక్తితో పాటు ఆందోళన కూడా ఉంటుంది. తాజాగా ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్కు సంబంధించి అలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్తో చెర్రీ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సుకుమార్ ప్రాజెక్ట్పై దృష్టి:
రామ్ చరణ్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్పై దృష్టి పెట్టారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం చరణ్ తన లుక్ను కూడా మార్చుకుంటున్నారు. ఈసారి మరింత లీన్ బాడీని సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఇలాంటి సమయంలో ఓం రౌత్ పేరు తెరపైకి రావడం ఆసక్తిని పెంచుతోంది.
పవర్ఫుల్ కథ:
ఓం రౌత్ ఇటీవల రామ్ చరణ్ను కలిసి ఓ పవర్ఫుల్ కథను వినిపించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ కథ చరణ్కు నచ్చిందని, ఆయన కూడా ఈ ప్రాజెక్ట్పై సానుకూలంగా స్పందించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని, ఇందులో చెర్రీ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ కాంబినేషన్కు సంబంధించి ఇప్పటివరకు చరణ్, ఓం రౌత్ లేదా చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఫ్యాన్స్కు టెన్షన్:
ఓం రౌత్ గతంలో ‘ఆదిపురుష్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయినప్పటికీ.. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. ముఖ్యంగా విజువల్స్, కథనం, పాత్రల చిత్రీకరణపై అప్పట్లో జోరుగా చర్చ జరిగింది. ఆదిపురుష్ చూసిన తర్వాత ఓం రౌత్తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు వెనకడుగు వేస్తున్నారు. ఆదిపురుష్తో ప్రభాస్ ఇమేజ్ను డ్యామేజ్ చేసిన క్రెడిట్ ఓం రౌత్కే ఉంది. అలాంటి దర్శకుడితో రామ్ చరణ్ సినిమా అంటే.. మెగా ఫ్యాన్స్కు టెన్షన్ తప్పదనే చెప్పాలి. మరి చెర్రీ నిజంగానే రిస్క్ చేస్తాడా? లేదా ఈ వార్తలు కేవలం పుకార్లేనా? అనేది తేలాల్సి ఉంది.