Reading Time: 2 minutes
50 Quintals Of Banned Chinese Thai Mangur Fish Seized 3 Traders Detained

Banned Thai Mangur Fish Seized in Katihar: బీహార్‌లోని కతిహార్ జిల్లాలో నిషేధిత చైనీస్ థాయ్ మాంగూర్ చేపల అక్రమ రవాణాపై మత్స్యశాఖ అధికారులు భారీగా దాడులు నిర్వహించారు. రౌతారా టోల్ ప్లాజా సమీపంలో రెండు ట్రక్కులను తనిఖీ చేసిన అధికారులు.. సుమారు 50 క్వింటాళ్ల నిషేధిత చేపలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు చేపల వ్యాపారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి సనత్ కుమార్ సింగ్ ఈ చర్యను ధృవీకరించారు. కోల్‌కతా నుంచి రెండు ట్రక్కుల్లో నిషేధిత చైనీస్ థాయ్ మాంగూర్ చేపలను లోడ్ చేసి పూర్ణియాకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. రౌతారా టోల్ ప్లాజా వద్ద మత్స్యశాఖ బృందం రెండు ట్రక్కులను ఆపి తనిఖీ చేయగా.. భారీగా నిషేధిత చేపలు బయటపడ్డాయి.

ముగ్గురు వ్యాపారులు అదుపులోకి

ఈ కేసులో అభిజీత్ సర్కార్, మహ్మద్ కలీమ్, మహ్మద్ అబ్దుల్లా అనే ముగ్గురు వ్యాపారులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చేపలను ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ అక్రమ రవాణా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణాల్లో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే విచారణలో ఒక వ్యాపారి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాము ప్రతిరోజూ పోలీస్‌స్టేషన్‌ను ‘మేనేజ్’ చేస్తూ నిషేధిత చేపల వ్యాపారం చేస్తున్నామని అతడు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. వ్యాపారి చేసిన ఈ వ్యాఖ్యలపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారంలో ఇతర వ్యక్తులు లేదా ఏదైనా వ్యవస్థ పాత్ర ఉందా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

స్వాధీనం చేసుకున్న చేపలు ధ్వంసం

స్వాధీనం చేసుకున్న నిషేధిత చైనీస్ థాయ్ మాంగూర్ చేపలను అధికారులు ధ్వంసం చేశారు. చేపలను తిరిగి మార్కెట్‌లోకి తరలించకుండా ఉండేందుకు జేసీబీ సహాయంతో భూమిని తవ్వి సుమారు 50 క్వింటాళ్ల చేపలను అందులో వేసి నాశనం చేశారు. రెండు ట్రక్కుల్లో ఇంత భారీ మొత్తంలో నిషేధిత చేపలు పట్టుబడటంతో అక్రమ చేపల రవాణా నెట్‌వర్క్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న మత్స్యశాఖ.. అక్రమ రవాణాకు సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసే పనిలో ఉంది. కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.