
మేడ్చల్ జిల్లా రాంపల్లి సత్యనారాయణ కాలనీలోని వైన్స్లో విక్రయించిన బీర్ బాటిల్లో పురుగులు కనిపించడంతో ఓ వినియోగదారుడు ఆందోళనకు గురయ్యాడు. బీర్ బాటిల్ను తెరిచిన అనంతరం అందులో పురుగులు ఉన్నట్లు గుర్తించినట్లు వినియోగదారుడు తెలిపారు.
ఈ ఘటనతో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా మద్యం విక్రయిస్తున్నారా? అంటూ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.బీర్ బాటిల్లో పురుగులు కనిపించిన విషయాన్ని వైన్స్ యజమాని దృష్టికి తీసుకెళ్లగా, యజమాని దురుసుగా సమాధానం చెప్పడంతో వినియోగదారుడికి, వైన్స్ యజమానికి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ ఘటనపై సంబంధిత ఎక్సైజ్ అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. పురుగులు కనిపించిన బీర్ బాటిల్ను పరిశీలించి, దాని నాణ్యతపై సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
మద్యం విక్రయ కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు, మద్యం నిల్వ విధానాలను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.