
పొన్నం సత్తయ్య చాలా ప్రజాదరణ కలిగిన వ్యక్తి అని మంత్రి వివేక్ అన్నారు. పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేశారు. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలకు కోదండరెడ్డికి, కళారంగంలో సేవలకు గొట్టే కనకవ్వకు, సాహిత్య రంగంలో విశిష్ట సేవలకు వెలిచాల కొండలరావుకు పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. 2009లో తాను ఎంపీగా గెలిచిన సమయంలో పొన్నం ప్రభాకర్ కూడా ఎంపీగా గెలిచారని గుర్తుచేశారు. యూత్ కాంగ్రెస్లో పొన్నం ప్రభాకర్ కీలకంగా పనిచేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా తెలంగాణ సాధన కోసం అందరం కలిసి కట్టుగా పనిచేశామని తెలిపారు. తెలంగాణను ఎలా సాధించుకోవాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండేదని అన్నారు.
పొన్నం ప్రభాకర్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉందని మంత్రి వివేక్ అన్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉండే అనుబంధాలు, లాభాలు మరెక్కడా ఉండవన్నారు. ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండాలంటే ఓపిక, పరస్పర అవగాహన, అడ్జస్ట్మెంట్ అవసరమని చెప్పారు.