Reading Time: < 1 minute
Vijayawada Btech Youth Arrested 40 Lakh Gold Theft Emi Debts

Vijayawada: విజయవాడలో ఆర్భాటపు జీవితం, అప్పుల ఊబిలో నుంచి బయటపడేందుకు బీటెక్ పూర్తి చేసిన 22 ఏళ్ల యువకుడు దొంగగా మారిన ఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడ వెటర్నరీ కాలనీలో భారీ చోరీకి పాల్పడిన నిందితుడు మరీదు వినోద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న దినేష్ కుమార్ కుటుంబం తన పాప వైద్య చికిత్స నిమిత్తం సెప్టెంబర్ 4న చెన్నైకి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన నిందితుడు వినోద్ కుమార్, సెప్టెంబర్ 5న ఇంటి తాళాలు పగులగొట్టి ఏకంగా రూ. 40 లక్షల విలువైన బంగారాన్ని చోరీ చేశాడు. పోలీసుల దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి, సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు చొక్కా విప్పేసి, తన బైక్ నంబర్ ప్లేట్‌ను మార్చి ఈ నేరానికి పాల్పడ్డాడు. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను డీసీపీ కృష్ణ కాంత్ పటేల్ వెల్లడిస్తూ, వినోద్ కుమార్ జాలీ లైఫ్ (లావిష్ లైఫ్) గడిపేందుకు అలవాటుపడి అప్పులు చేశాడని, ఆపై ఈఎంఐ (EMI)లు కట్టలేక దొంగతనాల బాట పట్టాడని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన రూ. 40 లక్షల విలువైన మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, త్వరలోనే అతడిని రిమాండ్‌కు తరలిస్తున్నామని డీసీపీ స్పష్టం చేశారు.