
Indian Railways: ఎవరూ చూడట్లేదు కదా అని చాలామంది రైలు ప్రయాణాల్లో లగేజీ బ్యాగుల్లో మద్యం బాటిళ్లను ఎవరికీ అనుమానం రాకుండా ప్యాక్ చేసుకుని వెళ్తుంటారు. ‘‘సీల్ ఓపెన్ చేయలేదు కదా.. పైగా తాగట్లేదు, కేవలం తీసుకెళ్తున్నాం అంతే!’’ అనే అతి నమ్మకంతో ప్రయాణిస్తుంటారు. అయితే ఇలా తీసుకెళ్లే ప్రతి ఒక్కరి మెడపై ఎప్పుడూ అరెస్ట్ కత్తి వేలాడుతూనే ఉంటుందన్న చేదు నిజాన్ని ఇండియన్ రైల్వేస్ రూల్స్ స్పష్టం చేస్తున్నాయి. మీరు ఎక్కే రైలు ఏ రూట్లో వెళ్తుందో తెలియకుండా ఒక్క బాటిల్ బ్యాగులో పెట్టుకున్నా.. ఏకంగా రూ.10,000 వరకు ఫైన్తో పాటు 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది జాగ్రత్త. ఇండియన్ రైల్వేస్ యాక్ట్ ప్రకారం రైలులో మద్యం తీసుకెళ్లడంపై కేంద్రం నేరుగా సర్వహక్కుల నిషేధం విధించలేదు. ఈ బాధ్యతను పూర్తిగా ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలకే అప్పగించింది. అంటే మీరు ప్రయాణించే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలే అక్కడ చెల్లుబాటవుతాయి.
లిక్కర్ బ్యాన్ ఉన్న రాష్ట్రాల్లో దొరికితే ఖతమే
బీహార్, గుజరాత్, నాగాలాండ్, లక్షద్వీప్ వంటి రాష్ట్రాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. మీరు వేరే రాష్ట్రంలో మద్యం కొని, మీ రైలు ఈ నిషేధిత రాష్ట్రాల సరిహద్దుల మీదుగా ప్రయాణిస్తుంటే.. అక్కడ తనిఖీల్లో పట్టుబడితే ఏ క్షణమైనా అరెస్ట్ కావడం ఖాయం. సీల్ చేసిన బాటిల్ అయినా, ఖాళీ బాటిల్ అయినా సరే.. ఆ రాష్ట్రాల ఎక్సైజ్ చట్టాల ప్రకారం కఠిన కేసులు నమోదవుతాయి. మద్యం పర్మిషన్ ఉన్న రాష్ట్రాల మీదుగా ప్రయాణించేటప్పుడు మాత్రమే నిబంధనలకు లోబడి వ్యక్తిగత యూజ్ కోసం తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇక్కడ కూడా కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంది. అనుమతి ఉన్న రాష్ట్రంలోనైనా ఒక ప్రయాణికుడైనా తనతో పాటు గరిష్టంగా రెండు లీటర్ల మద్యం మాత్రమే తీసుకెళ్లడానికి ఫర్మిషన్ ఉంటుంది. అలాగే బాటిల్స్ అన్నీ ఒరిజినల్ కంపెనీ సీల్ ప్యాకింగ్తో సేఫ్గా ఉండాలి. మూత తీసినా, ఖాళీ బాటిళ్లు వెంట ఉన్నా రైల్వే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే రైల్వే స్టేషన్ ఆవరణలో గానీ, నడుస్తున్న రైలు కంపార్ట్మెంట్లలో గానీ మందు తాగడం చట్టరీత్యా పూర్తిగా నిషేధం. బహిరంగంగా మద్యం సేవిస్తూ పోలీసులకు దొరికితే క్షమించే ప్రసక్తే ఉండదు.
తప్పు చేస్తే శిక్ష ఏంటి?
నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం తరలించినా, లేదా నిషేధిత రాష్ట్రాల మీదుగా అనుమతి లేకుండా తీసుకెళ్లినా సదరు ప్రయాణికుడిపై రైల్వే చట్టాలు, ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ చట్టాల కింద కేసులు పెడతారు. పట్టుబడిన వ్యక్తికి రూ.10,000 వరకు భారీ జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష విధిస్తారు. కొన్ని తీవ్రమైన కేసుల్లో ఈ రెండింటినీ ఏకకాలంలో అమలు చేస్తారు. అందుకే రైలు ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు మీ ట్రైన్ ఏయే రాష్ట్రాల మీదుగా వెళ్తుందో రూట్ మ్యాప్ సరిచూసుకోవడం ముఖ్యం. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సంతోషంగా సాగాల్సిన ప్రయాణం కాస్తా జైలు గడప తొక్కే ప్రమాదముంది.