
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు జరిగే శాంతి చర్చల్లో సహాయం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ముందుకు వచ్చారని రష్యా చెప్పింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్, చైనాలు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని రష్యా చెప్పింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘‘భారత్, చైనా సంసిద్ధతను స్వాగతించారు’’ అని క్రెమ్లిన్ ప్రతినిది డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.
ఈ పరిణామం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్గా చెప్పొచ్చు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పుకున్న ట్రంప్, ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్, చైనా ప్రయత్నాలను రష్యా స్వాగతించడం, ట్రంప్కు ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. బ్రిక్స్ సమావేశాల సమయంలో రష్యా నుంచి ఈ ప్రకటన వచ్చింది.
ట్రంప్ ప్రయత్నాలు..
ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ దౌత్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు రష్యా, ఉక్రెయిన్లలో చర్చలు జరిపారు. మరోవైపు, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ మాట్లాడుతూ.. యుద్ధాన్ని త్వరగా ముగించాలని కోరినట్లు సమాచారం. అమెరికా-రష్యా సంబంధాలను కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ట్రంప్ చెప్పారు.
జెలెన్స్కీ నుంచి సానుకూల ప్రకటన..
ఇదిలా ఉంటే యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలు ముఖాముఖిగా ఎప్పుడూ భేటీ కాలేదు. అయితే, వీరిద్దరి మధ్య సమావేశం జరిగే అవకాశాలు లేకపోలేదు. డిసెంబర్లో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ హాజరైతే తాను కూడా మియామికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు జెలెన్స్కీ చెప్పారు. ఇక జిన్పింగ్, మోడీలు కూడా శాంతి ప్రయత్నాలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని రష్యా చెబుతుండటం సానుకూల పరిణామాలుగా చెప్పవచ్చు.