
ఎర్రవల్లి ఘటనను నిరసిస్తూ మాల–మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ దగ్గర దళిత ఆత్మగౌరవ మహాధర్నా నిర్వహించారు. 2026 సెప్టెంబర్ 13న దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు పలువురు రాజకీయ, మేధోప్రముఖులు హాజరయ్యారు. దళితులు వెళ్లిన మార్గంపై పసుపు నీళ్లు చల్లి శుద్ధీకరణ చేశారన్న ఆరోపణలపై ఆందోళన చేపట్టారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యాఖ్యలు, ఎర్రవల్లి శుద్ధీకరణ ఘటనల విషయంలో దళితులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపి పూర్తి నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బూతులు తిట్టడం పై మాల-మాదిగ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డి.. స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దళితుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణపై మహాధర్నాలో చర్చ జరిగింది. సంక్షేమ పథకాల అమలు, దళితుల సమస్యలపై చర్చించారు. మాల ఉద్యమ నేత జి. చెన్నయ్య మాల, మాదిగ ఉద్యమ నేత మేడి పాపయ్య ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
అసెంబ్లీ ముందు జరిగిన ఘటన రాజ్యాంగ వ్యతిరేకం: ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం
అసెంబ్లీ ముందు జరిగిన సంఘటన కేవలం ఒక కులానికి సంబంధించింది కాదన్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన సంఘటన అని అన్నారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15 కి ఇది వ్యతిరేకమని అన్నారు.
అస్పృశ్యతని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. అంటరానితనం అంటే కేవలం మనుషులని భౌతికంగా కించపరచడమే మాత్రమే కాదన్నారు. మాటలపరంగా కించపరిచిన అది చాలా అన్యాయం చేసినట్టేనని అన్నారు. స్పీకర్ స్థాయిలో ఉన్న మనిషిని అలాంటి మాటలు అంటే కిందిస్థాయి మనుషులను పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నిరసన తెలపడానికి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళితే… అక్కడ జరిగిన ఘటన శోచనీయమన్నారు. స్పీకర్ పై చేసిన వ్యాకలు ఎవరు ఉపేక్షించేవి కాదన్నారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ నేతలు మేలుకోవాలని సూచించారు.
పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని కెసిఆర్ సమర్థిస్తున్నారా? ఎమ్మెల్యే సామేలు
దళితులు అడుగుపెట్టిన భూమిని పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని కెసిఆర్ సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు. కేసీఆర్ మౌనం స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యల్ని సమర్ధించడమైనా? అని ప్రశ్నించారు. దళితుల కోసం ఏ పని చేసినా బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అందుకే మాదిగ-మాల ఉపకలాల ఐక్యత వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దళిత నేతలపై జరిగిన అన్యాయాన్ని బి.జె.పి. నేతలు ఎందుకు ప్రశ్నించట్లేదని అన్నారు.
దళితులను చిన్నచూపు చూసే వారికి కఠిన శిక్ష పడాలి: శ్రీనివాసరెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్
దళితులను చిన్నచూపు చూసే వారికి కఠిన శిక్ష పడాలని అన్నారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు ఎవరు సహించేది కాదన్నారు. BRS పార్టీ కూడా ఆ వ్యాఖ్యలను సహించకూడదన్నారు.
దళితులు అడుగుపెట్టిన భూమిని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అంటే… మనం నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. పార్టీ నాయకత్వం క్షమాపణ చెప్పాల్సింది పోయి… దళితులు వెళ్లిన భూమిని పసుపు నీళ్లతో కడిగారని.. ఇంతకన్నా క్రూరమైన చర్య ప్రజాస్వామ్యంలో ఉండదన్నారు.
దళితులను చిన్నచూపు చూసే వారికి కఠిన శిక్ష పడాలని.. దళితుల ఐక్యత ఉంటే అందరి పని పట్టొచ్చునని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మీ బలమేంటో చూపించవచ్చుని సూచించారు.