Reading Time: 2 minutes
Hanuman Ansh 236 Crore Gross Producer Clears 100 Crore Ott Rumor

Hanuman Ansh: సినిమా హిట్ అయితే నిర్మాతలు లాభాల గురించి, తర్వాతి ప్రాజెక్టుల గురించి మాట్లాడటం సాధారణమే. కానీ కేవలం 21 ఏళ్ల వయసులో తన తొలి సినిమాతోనే వందల కోట్ల వసూళ్లను చూస్తున్న ఓ యువ నిర్మాత మాత్రం వచ్చిన డబ్బుతో ఏం చేయాలో తనకు తెలియడం లేదంటున్నారు. అంతేకాదు ఆ డబ్బును పేద పిల్లలకు సహాయం చేయడానికి, సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలనుకుంటున్నట్లు చెప్పడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే సమయంలో రూ.2 కోట్లలోపే తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ ఏకంగా రూ.236 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడంతో ఓటీటీ డీల్‌పై కూడా భారీ రూమర్లు మొదలయ్యాయి.

నీమ్ కరోలి బాబా జీవితం, ఆధ్యాత్మిక ప్రయాణం ఆధారంగా తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ మొదట్లో అసలు అంచనాలు లేకుండానే వచ్చింది. ఆగస్టు 7న కేవలం 25 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు సుమారు రూ.10 లక్షలు మాత్రమే వసూలు చేసింది. తొలి వారం కలెక్షన్ కూడా దాదాపు రూ.1.08 కోట్ల దగ్గరే ఉంది. రెండో వారంలో మరో రూ.40 లక్షల వరకు మాత్రమే రావడంతో సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్టేనని చాలామంది భావించారు. కానీ మూడో వారం నుంచి ప్రేక్షకుల మౌత్ టాక్‌తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్‌తో థియేటర్లు పెరిగాయి. సినిమా కలెక్షన్లు కూడా రోజురోజుకూ భారీగా పెరిగాయి. ఐదో వారానికి ఈ సినిమా భారత్‌లోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 37వ రోజుకు చేరుకునే సరికి ఇండియా నెట్ వసూళ్లు రూ.192 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు రూ.236 కోట్లను దాటాయి. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాకు ఇది ఏకంగా పెట్టుబడికి 100 రెట్లకు పైగా వచ్చిన స్థాయి విజయంగా మారింది.

ఈ విజయంతో అందరి దృష్టి 21 ఏళ్ల యువ నిర్మాత అనుప్రియ నగర్‌పై పడింది. యూనివర్సిటీ ఆఫ్ బాత్‌లో ఎకనామిక్స్ చదివిన అనుప్రియ, యూకేలో మూడేళ్లు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన తన పొదుపు మొత్తాన్ని ఈ సినిమా నిర్మాణంలో పెట్టినట్లు తెలుస్తోంది. ఆమెకు ముందుగా సినీ నిర్మాణంలో అనుభవం లేకపోయినా, నీమ్ కరోలి బాబా కథను యువతకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులోకి వచ్చారు.

ఇప్పుడు సినిమా ఇంత భారీగా సక్సెస్ కావడంతో అనుప్రియకు వచ్చిన ప్రశ్న మాత్రం డబ్బు గురించే. ఇంత మొత్తంలో డబ్బును తాను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని, వచ్చిన డబ్బును కూడా ఏం చేయాలో కూడా తనకు తెలియడం లేదని ఆమె రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. అయితే ఈ డబ్బును సేవా కార్యక్రమాలకు, పేద పిల్లలకు సహాయం చేయడానికి ఉపయోగించాలనుకుంటున్నట్లు ఆమె చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆమె నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

ఇక ‘హనుమాన్ అంశ్’కు రూ.100 కోట్ల ఓటీటీ డీల్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో ఊహించని స్థాయిలో సక్సెస్ కావడంతో ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏకంగా రూ.100 కోట్లు ఆఫర్ చేసిందనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఈ ప్రచారంపై నిర్మాత క్లారిటీ ఇచ్చారు. అలాంటి రూ.100 కోట్ల ఆఫర్ ఏదీ లేదని, అవన్నీ కేవలం రూమర్లేనని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం తమకు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎంత ఆఫర్ చేస్తుందనే దానికంటే, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాను చూస్తున్నారా అనేదే ముఖ్యమని ఆమె చెప్పారు.

మొత్తంగా చూస్తే రూ.2 కోట్లలోపే తీసిన సినిమా రూ.236 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం ఒక సంచలనం అయితే, 21 ఏళ్ల అనుప్రియ నగర్ తన పొదుపు మొత్తాన్ని పెట్టి ఈ ప్రయాణంలో భాగమవడం మరో విశేషం. ఇప్పుడు వచ్చిన డబ్బును కూడా సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని ఆమె అనుకోవడం ఈ కథలో మరింత ఆసక్తికరమైన అంశంగా మారింది. మరోవైపు రూ.100 కోట్ల ఓటీటీ డీల్ రూమర్‌కు నిర్మాత స్వయంగా చెక్ పెట్టడంతో, ప్రస్తుతానికి ‘హనుమాన్ అంశ్’ థియేటర్లలోనే తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. 250 నుంచి ఈ మూవీ 300 కోట్లను కూడా అవలీలగా దాటేలా కనిపిస్తోంది. అంతేకాదు  ఓటీటీ డీల్ కూడా 100 కోట్లకు ఏమాత్రం తగ్గదని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు.