
ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను అన్నింటిలో ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. అలాగే సామాజిక అంశాలపైనా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడిస్తుంటుంది. అయితే కొన్ని సార్లు అనసూయ కామెంట్స్ తీవ్ర వివాదానికి దారి తీస్తుంటాయి. ఇటీవల సనాతన ధర్మం, హిందూ మతంపై అనసూయ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. సీనియర్ నటి హేమతో పాటు పలువురు అనసూయ కామెంట్స్ ను తప్పుపట్టారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో మరో ఆసక్తికరమైన వీడియో షేర్ చేసింది అనసూయ. అందులో అనాదిగా మహిళలపై కొనసాగుతున్న కొన్ని సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి పలు ప్రశ్నలు లేవనెత్తింది. భర్త చనిపోయిన తర్వాత మహిళలు బొట్టు, గాజులు, గజ్జెలు వంటి వాటిని ఎందుకు తీసేయాలంటూ ప్రశ్నించింది? ‘ గత మూడేళ్లుగా ఒక ఆలోచన నన్ను బాగా తినేస్తోంది. మూడేళ్ల క్రితం మా నాన్న చనిపోయారు. మా అమ్మ చాలా అందంగా ఉంటుంది. బొట్టు పెట్టుకుని, మంచి రంగు గాజులు, గజ్జెలు ధరించి చాలా అందంగా ముస్తాబు అయ్యేది. అయితే నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ ఆడంబరాలన్నీ అమ్మకు దూరమయ్యాయి. మనకు బొట్టు, కాటుక, గాజులు, గజ్జెలు ఇవన్నీ ఎవరు పరిచయం చేశారు? మా అమ్మకు మా అమ్మమ్మ.. నాకు మా అమ్మ’
‘ అలాగే గోరింటాకు పెట్టుకోవడం, నెయిల్ పాలిష్ వేసుకోవడం వంటి వాటిని కూడా మనకు పెళ్లికి ముందే అమ్మలు, అమ్మమ్మలు పరిచయం చేసినవే. అలాంటప్పుడు వాటిని పెళ్లితో ఎందుకు ముడిపెట్టాలి? భర్త చనిపోగానే బొట్టు, గాజులు, గజ్జెలు వంటి వాటిని ఎందుకు తీసేయాలి? అలా అని ఎక్కడ రాసి ఉంది? ఒకవేళ ఇవన్నీ పెట్టుకోవద్దని అనుకుంటే.. అమ్మమ్మ చనిపోయినప్పుడే అమ్మ కూడా వాటిని మానేయాలి కదా. అది పర్సనల్ ఛాయిస్లా ఉండాలి. అన్నట్లు ఇది కేవలం నా ఆలోచన మాత్రమే. నేను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన విధంగా జీవించే స్వేచ్ఛ ఉండాలి. ఒక మహిళ బొట్టు పెట్టుకోవాలా? వద్దా? గాజులు ధరించాలా? వద్దా? అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయంగా ఉండాలి’ అని అనసూయ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అనసూయ కామెంట్స్ పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
అనసూయ రిలీజ్ చేసిన వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.