
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రంగ్పూర్ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ స్వగృహంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడు, ఆయన భార్య, కుమార్తె, 12 ఏళ్ల కొడుకు మృతదేహాలు మూసి ఉన్న ఇంట్లోనే లభించాయి. ప్రాథమిక విచారణ ఆధారంగా ఈ నలుగురినీ గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వ్యక్తులు ఒకే హిందూ ఫ్యామిలీకి చెందిన వాళ్లు కావడంతో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ ఘోర ఉదంతంపై పోలీసులు, సీఐడీ (CID), డిటెక్టివ్ బ్రాంచ్ (DB) బృందాలు సంయుక్తంగా సమగ్ర విచారణను వేగవంతం చేశాయి.
దాస్పారా (మచువాపారా) ప్రాంతంలో శనివారం రాత్రి పొద్దుపోయాక ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మృతులను రంగ్పూర్ జిల్లా పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత చక్రవర్తి (50), కుమార్తె ఆగామి చక్రవర్తి ప్రార్థి (23), కుమారుడు ప్రియం చక్రవర్తి (12)గా గుర్తించారు. ఘటనా స్థలంలో సీఐడీ బృందం జరిపిన సోదాల్లో తల్లి, కుమార్తెల మృతదేహాలు మెట్లపై పడి ఉండగా, గణపతి చక్రవర్తి మృతదేహం భవనం పైకప్పు (టెర్రస్)పై, 12 ఏళ్ల బాలుడి మృతదేహం గదిలోని మంచం కింద లభించాయి. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం వేకువజాము మధ్య ఈ దారుణం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గురువారం రాత్రి నుంచి కుటుంబ సభ్యుల ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చిన బంధువులు శనివారం రాత్రి ఇంటికి వచ్చి చూశారు. ఇంటి తలుపు తాళం వేసి ఉండటం, లోపల లైట్లు ఆఫ్ చేసి ఉండటంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లగా ఈ దారుణ దృశ్యం వెలుగులోకి వచ్చింది. గణపతి చక్రవర్తికి ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఆయన గతేడాది పదవీ విరమణ పొందిన తర్వాత హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నారని బంధువులు తెలిపారు. ఆయన కుమార్తె ఈ ఏడాదే ఆంగ్లంలో మాస్టర్స్ పూర్తి చేయగా, కుమారుడు ఐదో తరగతి చదువుతున్నాడు. నలుగురి మృతికి గల ఖచ్చితమైన కారణాలు పోస్ట్మార్టం నివేదిక వచ్చాకే స్పష్టమవుతాయని, కేసును అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని రంగ్పూర్ మెట్రోపాలిటన్ పోలీస్ అధికారులు వెల్లడించారు.