
జయశంకర్ భూపాలపల్లి/ చిట్యాల, వెలుగు: పారదర్శక, తప్పులులేని ఓటర్ల జాబితా రూపొందించేందుకు చేపట్టిన ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం అవసరమని జయశంకర్భూపాలపల్లి జిల్లా ఎన్నికల ఆఫీసర్, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం ఐడీవోసీలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై మ్యాపింగ్ కాని, అనామలీస్ ఓటర్లకు నోటీసుల జారీపై సమీక్షించారు. జిల్లాలో 11,739 మంది అన్మ్యాప్డ్, 20,685 మంది అనామలీస్ ఓటర్లు ఉన్నారని, మొత్తం 32,424 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉందన్నారు.
ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించి, అక్టోబర్ 15 నాటికి ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరై జనన తేదీ, నివాసం తదితర వివరాలకు ఆధారాలు సమర్పించాలని సూచించారు. ప్రక్రియ వేగవంతానికి మండలాల ఎంపీడీవోలు, భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ను అదనపు ఏఈఆర్ఓలుగా నియమించి శిక్షణ ఇచ్చామని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అనంతరం చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిని కలెక్టర్ తనిఖీ చేసి, వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహదేవ్పూర్ సామాజిక ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ నియామకానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.