Reading Time: < 1 minute

ఈరోజుల్లో అందరికీ షుగర్ ఉంది.. పంచదార రేటు పెరిగినా పెద్ద మేటర్ కాదు: బీహార్ మంత్రి ప్రకటన

Caption of Image.

పాట్నా: దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా చక్కెర ధరలు పెరుగుతున్న క్రమంలో.. ఈ పరిణామంపై బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రావణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజుల్లో ప్రతీ ఒక్కరికీ డయాబెటిస్ (మధుమేహం) ఉందని.. అందువల్ల పంచదార ధర పెరిగినా పెద్ద ప్రభావం ఏం ఉండకపోవచ్చని ఈ బీహార్ మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రీ-డయాబెటిక్, డయాబెటిక్ కేసులు పెరుగుతున్న కారణంగా ప్రజలు ఎలాగూ చక్కెర వినియోగం విషయంలో జాగ్రత్త పడుతున్నారని.. ఈ క్రమంలో చక్కెర ధర పెరిగినా దేశ ప్రజలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనేది ఈ మంత్రి వ్యాఖ్యల సారాంశం.

మధుమేహ రోగుల కేసులు పెరుగుతున్నందున, ప్రజలు స్వీట్లు తినడం లేదని, స్వీట్లు తక్కువగా తింటున్నారని మంత్రి చెప్పారు. విలేకరుల ముందు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదెక్కడి లాజిక్ అని.. మంత్రి ప్రకటనపై ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ మాత్రం కుమార్‌పై తీవ్రమైన వ్యంగ్యంతో విరుచుకుపడింది.

►ALSO READ | కేంద్రం మెడలు వంచిన రాహుల్:  పెల్లెట్ గన్ కాల్పులపై ఎట్టకేలకు FIR ఫైల్

కప్పు టీతో తమ దినచర్యను ప్రారంభించే లేదా బ్రెడ్ లేదా బిస్కెట్‌ను టీలో ముంచుకుని తాగే సామాన్య ప్రజలు, పెరుగుతున్న చక్కెర ధరల వల్ల తీవ్ర ప్రభావానికి గురయ్యారని ఆర్‌జేడీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ తెలిపారు. శ్రావణ్ కుమార్ ఒక మంత్రి అయినందు వల్ల.. ఆయన పెరుగుతున్న చక్కెర ధరను భరించగలరని.. అందుకే చక్కెర ధరలపై సామాన్య ప్రజల ఆందోళనలు ఆయనకు హాస్యాస్పదంగానే అనిపించవచ్చని అహ్మద్ అన్నారు.

©️ VIL Media Pvt Ltd.