Reading Time: 3 minutes
Rahul Gandhi Pellet Gun Case Fir Filed After Sahil Lochab Protest

ఢిల్లీలో విద్యార్థి ఆందోళనకారుడిపై పెల్లెట్ గన్ ప్రయోగించారనే ఆరోపణల కేసులో ఎట్టకేలకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధితుడు సాహిల్ లోచబ్‌తో కలిసి ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌ బయట ధర్నాకు దిగిన కొన్ని గంటల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Rahulgandhi

19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచబ్ జూలై 20న పార్లమెంట్ వైపు జరిగిన నిరసన ర్యాలీలో పెల్లెట్ గన్ గాయాలకు గురైనట్లు ఆరోపించాడు. ఈ ఘటనకు సంబంధించి తన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం లేదని పేర్కొంటూ రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్‌ బయట రోజంతా ధర్నా చేశారు.

‘‘ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోతే 30 రోజులు అయినా, ఆరు నెలలు అయినా పోలీస్ స్టేషన్‌ బయటే ధర్నా చేస్తాను’’ అని రాహుల్ గాంధీ పోలీసులకు హెచ్చరించారు. ఉదయం సుమారు 11.30 గంటలకు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయన.. సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం న్యాయం దిశగా తొలి అడుగు అని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘పెల్లెట్లు కాల్చి నెల రోజులు అవుతోంది. సాహిల్ శరీరంలో పెల్లెట్లు ఉన్నాయి. అందులో మూడు కంటిలో ఉన్నాయి. యువకుడికి అన్యాయం జరిగిందనేది స్పష్టంగా తెలుస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఇది న్యూఢిల్లీలోని నడిబొడ్డున ఉన్న పోలీస్ స్టేషన్. ఇక్కడే న్యాయం అందకపోతే.. గ్రామాలు, చిన్న పట్టణాల్లోని పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి’’ అని రాహుల్ అన్నారు.

బాధితుడి తల్లిని పరామర్శించిన రాహుల్

సాహిల్ లోచబ్ తల్లి కూడా పోలీస్ స్టేషన్‌ బయట ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ఉద్దేశించి రాహుల్ గాంధీ.. ‘‘ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా?’’ అని ప్రశ్నించారు. తనకు రాహుల్ గాంధీపై నమ్మకం ఉందని సాహిల్ తెలిపారు. ‘‘లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఇక్కడ ఉన్నప్పుడు వారు తప్పకుండా ఫిర్యాదు నమోదు చేస్తారని నాకు నమ్మకం ఉంది. నమ్మకాన్ని కోల్పోకూడదు. దేశంలో ఇలాంటి జననాయకులు ఉన్నంతకాలం మన గొంతును ఎవరూ నొక్కలేరు’’ అని అన్నారు.

అంతకుముందు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులు నిరాకరించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. విద్యార్థుల ఆందోళనల సమయంలో పోలీసులు, పారామిలిటరీ బలగాలు అధికంగా, అసమానంగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే హై పవర్డ్ ఎక్స్‌పర్ట్ కమిటీని ఏర్పాటు చేసిందని పోలీసులు తెలిపారు. అయితే జూలై 20న జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా నిరసన చేస్తున్న సాహిల్‌పై పోలీసులు పెల్లెట్ గన్‌తో దాడి చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఘటన కారణంగా అతడి ఒక కంటిచూపు ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు.

విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారన్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు గతంలో ఖండించారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో చిన్న లోహపు గుళ్లను ప్రయోగించే పెల్లెట్ గన్స్ తీవ్ర గాయాలకు కారణమయ్యే అవకాశం ఉంది. జంతర్ మంతర్ దగ్గర జరిగిన నిరసనల్లో కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను మోహరించారు. పెల్లెట్ గన్స్, షాక్ బ్యాటన్లు ఆర్‌ఏఎఫ్ వినియోగించే అల్లర్ల నియంత్రణ పరికరాల్లో భాగంగా ఉన్నాయి. అయితే ఢిల్లీ నిరసనల్లో వాటిని ఉపయోగించారా లేదా అనే అంశంపై CRPF నుంచి స్పష్టత రాలేదు.

ధర్నా కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ మీడియా కెమెరాల ముందు సాహిల్ శరీరం నుంచి తొలగించినట్లు చెబుతున్న పెల్లెట్లను చూపించారు. చిన్న ప్లాస్టిక్ బాక్స్‌లో ఉన్న వాటిని చేతిలోకి తీసుకుని మీడియాకు చూపించారు. ‘‘ఇవి పెల్లెట్లు. జాగ్రత్తగా చూడండి. ఇవి అతడి శరీరం నుంచి వచ్చినవి’’ అని రాహుల్ అన్నారు. అనంతరం సాహిల్ తన గాయాలను చూపించాడు. అతడి వైద్య నివేదికల్లో శరీరంలో 200కు పైగా పెల్లెట్లు ఉన్నట్లు, కంటిలో మూడు పెల్లెట్లు ఉన్నట్లు పేర్కొన్నారని రాహుల్ తెలిపారు.

సాహిల్ మాట్లాడుతూ.. జూలై 20న తనపై పెల్లెట్ గన్ ప్రయోగించారని ఆరోపించాడు. తొలుత లేడీ హార్డింజ్ ఆసుపత్రిలో చేర్చారని, అక్కడి నుంచి ఎయిమ్స్‌కు తరలించారని తెలిపాడు. ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స జరిగినప్పటికీ తన కంటిచూపు ఇంకా స్పష్టంగా లేదని వెల్లడించాడు. ఆగస్టు 14న ఏడు పేజీల ఫిర్యాదును తన న్యాయవాదికి ఇచ్చానని.. అయినప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని చెప్పాడు.

ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన సమయంలో తమను కనాట్ ప్లేస్, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ల మధ్య తిప్పారని సాహిల్ న్యాయవాది ఆరోపించారు. జంతర్ మంతర్‌కు సంబంధించిన కేసులన్నీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యాయని తొలుత కనాట్ ప్లేస్ పోలీసులు చెప్పారని, అక్కడికి వెళ్లిన తర్వాత ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి వస్తుందని చెప్పి తిరిగి పంపించారని న్యాయవాది తెలిపారు. ఫిర్యాదును చదివిన తర్వాత పోలీసులు దాన్ని తిరిగి ఇచ్చారని, చాలా సేపు వేచి ఉండేలా చేశారని ఆరోపించారు. తమ కేసును స్వీకరించబోమని, ‘‘పై నుంచి ఆదేశాలు వచ్చాయి’’ అని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫోన్‌లో చెప్పారని న్యాయవాది పేర్కొన్నారు.

అమిత్ షాకు రాహుల్ లేఖ

శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై జరిగిన ‘దారుణ దాడి’పై బాధ్యత వహించాలని కోరుతూ రాహుల్ గాంధీ గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. యువతపై పెల్లెట్ గన్స్ వంటి ప్రాణాంతక బలప్రయోగానికి అనుమతి ఇచ్చారా అని ప్రశ్నించారు.

జూలైలో పేపర్ లీకులు, విద్యార్థులపై దాడులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వైపు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. రాహుల్ రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. అనంతరం ఆయనను పోలీసులు అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఆ సమయంలో ఆయన ముక్కు నుంచి రక్తం కారుతున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.