
హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏకాదశికి విశిష్టత ఉంటుంది. శ్రావణమాసం అంటే పూజల మాసం. ఈ నెలలో వచ్చే ఏకాదశికి రోజు చాలా పవర్ ఫుల్. శ్రావణమాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పుత్రదా ఏకాదశి అంటారు. ఈ ఏడాది ( 2026) అలాంటి పవిత్రమైన రోజు ఆగస్టు 23 ఆదివారం వచ్చింది. ఆరోజున లక్ష్మీసమేతుడైన శ్రీమహావిష్ణువును పూజిస్తారు. అయితే ఈ ఏడాది ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, పూజా విధానం ఏంటో తెలుసుకుందాం..
హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పవిత్ర శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశికి ఆధ్యాత్మికంగా విశేషమైన స్థానం ఉంది. ఈ ఏకాదశి రోజున భోళా శంకరుడితో పాటు జగత్ప్రభువైన శ్రీమహావిష్ణువును ఏకకాలంలో పూజించాలని పండితులు చెబుతున్నారు,
2026 పుత్రదా ఏకాదశి ముహూర్తం వివరాలు
ఏకాదశి తిథి ప్రారంభం:ఆగస్టు 23 ఉదయం 2:00 గంటలకు(రాత్రి సమయంలో..తెల్లవారితే 24)
ఏకాదశి తిథి ముగింపు:ఆగస్టు 24 ఉదయం 4:19
పుత్రద ఏకాదశి పండుగను ఆగస్టు 23 ఆదివారం నాడు ఆచరిస్తారు. ఉపవాసాన్ని ఆగస్టు 24 మధ్యాహ్నం1:41 తరువాత విరమించాలి.
పుత్రతా ఏకాదశి వ్రతాన్ని అత్యంత నిష్టతో పాటించాలి. దశమి నాటి నుంచి ద్వాదశి వరకు మూడు రోజుల పాటు కఠినమైన నియమాలను పాటించడం ఆచారంగా వస్తోంది. సాత్విక ఆహారం తీసుకుంటూ, మనసా వాచా కర్మణా దైవ స్మరణలో గడపాలి. శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశి సంతాన సౌభాగ్యాన్ని కోరుకునే దంపతులకు విశేషమైనదిగా భావిస్తారు.
పూజా వివరాలు
- ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి తలస్నానం చేయాలి.
- దంపతులు పుత్రద ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు దశమి రోజు నుంచి ఉపవాసాన్ని ప్రారంభించాలి.
- ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి.
- పూజా స్థలంపై విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉంచి ‘పంచామృతం’ అభిషేకం చేయాలి.
- పూలు, పసుపు, కుంకుమతో అర్చించి .. విష్ణు సహస్రనామం పఠించాలి. లేదా శ్రద్దగా విన్నా సరిపోతుంది. పూజలో కచ్చితంగా తులసి దళాలు ఉండేలా చూసుకోండి.
- విష్ణుమూర్తి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండాలి.
- విష్ణువును స్తుతిస్తూ భజనలు….భక్తి పాటలు పాడుతూ రాత్రంతా జాగారం చేస్తారు. భక్తులు సాయంత్రం సమయంలో సమీపంలోని విష్ణువు ఆలయాలను కూడా సందర్శించాలి
- పుత్రదా ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయఅనేమంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపం చేయాలి.
శ్రావణ పుత్రదా ఏకాదశి ఆచారాలు
- శ్రావణ పుత్ర ఏకాదశి నాడు ఉపవాసం ప్రధాన ఆచారం. మగబిడ్డ కోసం ఆరాటపడితే భాగస్వాములిద్దరూ తప్పనిసరిగా ఉపవాసం పాటించాలి.
- సంతానం కావాలనుకునే దంపతులు కఠినమైన ఉపవాసాన్ని పాటించాలి.
- ఆరోగ్య కారణాల వలన ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు.
- శ్రావణ పుత్రదా ఏకాదశి నాడు ధాన్యాలు, పప్పులు, బియ్యం, ఉల్లిపాయలు మరియు మాంసాహారం అసలు తినకూడదు.
- దశమి రోజు ( ఆగస్టు 22) సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినాలి. దశమి రాత్రి సంపూర్ణ బ్రహ్మచర్యం పాటిస్తారు.
- ఉపవాసాన్ని ద్వాదశి ఘడియలు ముగిసేలోగా విరమించాలి. నిష్టగా ఉపవాసాన్ని చేస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని అని నమ్మకం .. సంతానం కలుగుతుంది.
- పూజా క్రతువులు ముగించి, బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇచ్చి.. ఉపవాసం విరమించాలి.
పుత్రద ఏకాదశి ప్రాముఖ్యత
పుత్రద ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుందని నమ్ముతారు. కొత్తగా పెళ్లైన జంటలు ఈ ఏకాదశి చేయడం ఉత్తమంగా భావిస్తారు. ఈ పవిత్ర రోజున సిద్ధ యోగం, పూర్వాషాఢ నక్షత్రం యొక్క అద్భుతమైన కలయిక కుదురుతోంది. ఈ శుభ సంయోగం వల్ల పూజా ఫలం రెట్టింపు అవుతుందని నమ్ముతారు. శ్రీహరికి ఏకాదశి తిథి అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. ముఖ్యంగా చాతుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతం ఆచరించి పూజలు చేయడం వలన సకల శుభాలు కలిగి ..శ్రీహరి దంపతులతో పాటు పరమేశ్వరుని దంపతుల ఆశీస్సులు మీకు మెండుగా ఉంటాయి. మీ కోరికలు ఫలిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.