
యూరప్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా వసూలు చేసి.. బోర్డు తిప్పేసిన ఘటన విశాఖలో వెలుగు చూసింది. సౌజన్య అనే కిలాడీ లేడీ ఫ్లయింగ్ బోర్డర్స్ అనే సంస్థ ద్వారా విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 లక్షలు రూపాయలు చొప్పున వసూలు చేసి మోసగించింది. నెలలు గడుస్తున్నా ఉద్యోగాల రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఇప్పటి వరకు 18 మంది బాధితులు సుమారు రూ.65 లక్షలు వరకు మోసపోయినట్లు ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సర్చ్ వారంటీతో కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడప లోని సౌజన్య ఇంటికి విశాఖ పోలీసులు వెళ్లారు. సౌజన్యను అరెస్టు చేసి విశాఖకు తీసుకువచ్చారు. నిందితురాలు సౌజన్యపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నట్లు తెలిపారు. వందలాది మందిని మోసం చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు విశాఖ పోలీసులు. కిలాడీ లేడిని కోర్టుకు తరలించారు పోలీసులు.