
Off The Record: శ్రీకాకుళం పట్టణం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారింది. కానీ ప్రజలను ఒనగూరిన ప్రయెజనం మాత్రం శూన్యం. ఇప్పటిదాకా శ్రీకాకుళం కార్పొరేషన్కు ఎన్నికలు జరగలేదు. సిక్కోలు పుర పోరుకు రాజకీయ గ్రహణం పట్టిందనే మాట వినిపిస్తోంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అయినా.. శ్రీకాకుళం కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే అనుమానాలు ప్రజలను ఆవరించాయి. అందుకు కారణమేంటి..? ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీకాకుళం మున్సిపాలిటీకి చివరగా 2005లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత అక్కడ ఓట్ల పండగ జరగనేలేదు. రెండు దశాబ్దాలుగా స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు సిక్కోలు ప్రజలు. ఈ మధ్యలో శ్రీకాకుళం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయింది. మరి కార్పొరేషన్కు ఎన్నికలు ఎప్పుడు జరుగతాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రతీసారి ఏదో ఒక కారణంతో ఎన్నికలు జరగడంలేదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా అన్ని పార్టీలకూ ఇందులో ఎంతో కొంత పాత్ర ఉంది. గతంలో ఎన్నికలకు సిద్ధమైన తరుణంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించలేదంటూ దళిత సంఘాల ద్వారా కోర్టులో పిల్ వేయిచారని టీడీపీ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే అన్నీ చక్కదిద్ది ఎలక్షన్ జరిపిస్తామని 2024లో టీడీపీ హామీ ఇచ్చింది. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈసారైనా శ్రీకాకుళం కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతాయా..? అంటే చెప్పలేని పరిస్థితి. కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే మేయర్ పీఠంపై కూర్చున్న వ్యక్తి మరో అధికార కేంద్రంగా మారే ప్రమాదం ఉందని భయపడుతున్నారట ఎమ్మెల్యేలు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం పట్టణం, గార మండలాల పరిధిలోనే ఉంటుంది. కార్పొరేషన్ ఎన్నిక జరిగితే మేయర్ది కీ రోల్ అవుతుంది. ఎమ్మెల్యే ఒకే మండలానికి పరిమితం కావాల్సి వస్తుందనే భయం పట్టుకుందట. ఇప్పుడు స్థానిక ప్రజా ప్రతినిధులంటూ ఎవరూ లేకపోవడంతో తెరవెనుక ఉండి అధికారులతో కథ నడిపిస్తున్నారట. కాంట్రాక్టులు మొదలు ప్రతీ అంశంలో ఎమ్మెల్యే మాటే ఫైనల్ అట. కార్పొరేషన్ ఎన్నికలు జరిగి మేయర్ పీఠం ఎక్కితే ఎమ్మెల్యే మాట చెల్లదు. అది ఇష్టంలేకనే ఏదో ఒక కారణం చెప్పి మున్సిపల్ ఎన్నికలు జరగకుండా కేసులు వేయిస్తున్నారట.
ఇక, పురపోరులో ఓడిపోతే పరువు పోతుందనే ఆందోళనతో ఎన్నికలకు మెకాలడ్డుతున్నారట అక్కడి పెద్ద నాయకులు. ఇందులో ఎల్లమ్మను ఎంచక్కరలేదు, పోలమ్మను పొగడనక్కరలేదు అన్నట్టుగా టీడీపీ, వైసీపీ నేతల తీరు ఉందట. ఎన్నికలు ఏవిధంగా వాయిదా వేయాలో ఆ విధంగానే కోర్టులలో కేసులు వేయించడం చేశారట. ఇందులో రెండు ప్రధాన పార్టీల ఉందంటున్నారు పట్టణ ప్రజలు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరగకపోవడానికి 2 అంశాలు ప్రధాన కారణంగా ఉన్నాయి. మొదటిది విలీన పంచాయతీలు, రెండోది రిజర్వేషన్ అంశాలు. అసలు విలీన పంచాయతీలు ఏం కోరుకుంటున్నాయి..? దీనికి స్థానిక ఎమ్మెల్యే పరిష్కారం చూపలేరా..? పంచాయతీల విలీనంపై గతంలోనే చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. ఆ చట్టంపై అనేక పంచాయతీలు హైకోర్టులో పోరాడుతున్నాయి. 2022లో వార్డుల పునర్విభజన చేశారు. అది అస్తవ్యస్తంగా జరిగిందంటూ ఆధారాలతో సహా విలీనపంచాయతీలు మళ్లీ కోర్టుకెక్కాయి. కోర్టు మొట్టికాయలు వేయడంతో కేసు ముగిసే వరకు ఎన్నికలు జరపబోమని హామీ ఇస్తూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కేసులు విత్డ్రా జరగాలి.. లేదంటే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావాలి. అదయ్యేదాకా ఎన్నికలు జరగడం అసాధ్యం. అన్ని వర్గాలకు తగ్గట్టుగా రాజకీయ పరిష్కారం చూపితే అభ్యంతరాలు ఉండకపోవచ్చనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు బాల్ రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రులుగా ఉన్న బాబాయ్, అబ్బాయ్ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుల కోర్టులో ఉందట. అలాగే శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ కూడా చొరవ తీసుకోవాలనే డిమాండ్ కూడా వినినిస్తోందట. అలాగైతేనే శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతాయనే చర్చ జరుగుతోంది.