
Off The Record: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన సమయంలో జరిగిన హడావుడే. ఈ నెల 21న ఓ పెళ్లికి వచ్చిన జగన్ మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకునేందుకు వందలాది మంది బేగంపేట ఎయిర్పోర్ట్కు వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు జగన్కు స్వాగతం పలుకుతూ స్వాగత తోరణాలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ వైసీపీ నేతలో, కార్యకర్తలలో చేసి ఉంటే ఇంతలా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు జగన్కు స్వాగతం పలుకుతూ కటౌట్స్, బ్యానర్స్ ఏర్పాటు చేశారు. దీనిపై రాజకీయ చర్చ మొదలైంది. అసలు తెలంగాణలో వైసీపీ యాక్టివిటీ ఏమీ లేదు. అది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పరిమితమైన పార్టీ. అలాంటప్పుడు తెలంగాణలో జగన్కు ఈ రేంజ్లో స్వాగత కటౌట్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే చర్చ రాజకీయ వర్గాలతోపాటు జనంలోనూ జరుగుతోంది.
అయితే… జగన్కు వెల్కమ్ పలకడం వెనక రాజకీయ అవసరం కూడా ఉండి ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో త్వరలో జరగబోయే మూడు కార్పోరేషన్ల ఎన్నికలే కారణమనే విశ్లేషణలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాలకే పరిమితమైనప్పటికీ ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు గ్రేటర్ పరిధిలో చాలామందే ఉన్నారు. వారి ఓట్లపై బీఆర్ఎస్ కన్నేసిందనే మాట వినిపిస్తోంది. జగన్కు ఇంత ఘనంగా స్వాగతం పలకడం… వచ్చే ఎన్నికల్లో తమకు కలసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోందట. మూడు కార్పొరేషన్ల పరిధిలో ఉన్న జగన్ అభిమానుల ఓటు బ్యాంకు బీఆర్ఎస్ వైపు మళ్ళించడం కోసమే ఇలాంటి ఏర్పాట్లు చేశారట గులాబీ నాయకులు. మూడు కార్పొరేషన్ల పరిధిలో ఏపీకి చెందిన చాలామంది తమ ఓట్లను ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించుకున్నారు. అదే సమయంలో కొందరు తమ ఓట్లను ఇక్కడే కొనసాగించుకున్నారు. వారిలోని జగన్ అభిమానులను తమవైపు తిప్పుకోవడం, వారి ఓట్లను తమ పార్టీకి మళ్లించుకోవడమే బీఆర్ఎస్ వ్యూహం అని చెప్పుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కటౌట్లను, స్వాగత తోరణాలను జగన్ చూసీచూడనట్టు వదిలేసినా… కేటీఆర్, కేసీఆర్, జగన్ ఫొటోలతో కూడిన కటౌట్లు మాత్రం అభిమానుల మనసులో నిలిచిపోతాయనే భావన ఉంది.
జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఆయనకు స్వాగతం పలికేందుకు, వీడ్కోలు చెప్పేందుకు బేగంపేట ఎయిర్పోర్ట్కు వచ్చే ప్రతీ అభిమాని చూసే విధంగా కటౌట్లు ఏర్పాటు చేశారు. రాబోయే ఈ మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయదు. ఎవరికి సపోర్ట్ చేయాలో కూడా బహిరంగ ప్రకటన చేసే అవకాశం కూడా లేదు. ఈ నేపథ్యంలో జగన్ ఫోటోలతో బీఆర్ఎస్ నేతల ఫోటోలు కటౌట్లలో పెట్టడం ద్వారా వైసీపీ అభిమానులను తమ వైపు తిప్పుకోవచ్చనే ఆలోచన బీఆర్ఎస్ నేతలు చేశారట. ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ కీలక నేతలు, గులాబీ పార్టీ పెద్దల పాత్ర ఉండకపోవచ్చని తెలంగాణ భవన్ వర్గాలంటున్నాయి. బీఆర్ఎస్లో ఉండి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉన్న నాయకులే ఇలా కటౌట్లు, బ్యానర్లు పెట్టి ఉంటారని పార్టీలో చర్చ జరుగుతోంది.