Reading Time: 2 minutes
Sunnam Cheruvu Hyderabad Tourism Hydraa Development

HYDRAA : హైదరాబాద్ ఐటీ కారిడార్ మెరుపులు ఒకవైపు.. బోరబండ బస్తీ ఆశలు మరోవైపు.. ఈ రెండింటి సరిహద్దుల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన మురుగు కూపం ఇప్పుడు ఒక అద్భుత పర్యాటక జలధారగా రూపాంతరం చెందుతోంది. మాదాపూర్ గుట్టల బేగంపేట పరిధిలో అక్రమ ఆక్రమణలు, విష రసాయనాల వ్యర్థాలతో ప్రాణవాయువు కోల్పోయిన ‘సున్నం చెరువు’కు హైడ్రా (HYDRAA) సజీవ రూపాన్నిస్తోంది. చుట్టుపక్కల నివాసాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఆక్రమణల పుణ్యమా అని కేవలం 14.20 ఎకరాలకు కుచించుకుపోయిన ఈ చెరువును ఏకంగా 30.5 ఎకరాల వైశాల్యానికి విస్తరించి సంచలనం సృష్టించింది. గతంలో ఇక్కడి ట్యాంకర్ల నీటిలో పాదరసం, సీసం, ఆర్సెనిక్ వంటి అత్యంత ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చిన హెచ్చరికలతో, ఇక్కడ సాగుతున్న మురుగు నీటి దందాకు అధికారులు శాశ్వతంగా చెక్ పెట్టారు.

ఆధునిక సౌకర్యాలు.. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం

సున్నం చెరువులో దశాబ్దాలుగా పేరుకుపోయిన దాదాపు 3 మీటర్ల లోతు ప్లాస్టిక్, ఘన వ్యర్థాలను హైడ్రా తొలగించడంతో ఆ ప్రాంతంలో దుర్గంధం మాయమైంది. చెరువు ప్రారంభానికి ముందే చుట్టుపక్కల ప్రజలు రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో చెరువు చుట్టూ నిర్మించిన వాకింగ్ ట్రాక్‌పై ఆహ్లాదకరంగా గడుపుతున్నారు. ఈ చెరువు పునర్నిర్మాణ పనులు త్వరలోనే పూర్తికానుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగవంతం అవుతున్నాయి. అలాగే చెరువు ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలోని గుడిసెలలో నివాసముంటున్న నిర్భాగ్యులకు సీఎం చేతుల మీదుగానే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అందజేసి గౌరవప్రదమైన జీవితాన్ని అందించనున్నారు.

ఆంజనేయ స్వామి ఆలయ అద్భుత పునర్నిర్మాణం

చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిరుపయోగంగా, చెత్తాచెదారం మధ్య ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా హైడ్రా మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతోంది. ఆలయ కమిటీ ప్రతినిధులతో పలుమార్లు సమావేశమై వారి సూచనల మేరకు దివ్యమైన గోపురం, భక్తులు ప్రదక్షిణలు చేసేందుకు వీలుగా ప్రత్యేక పాత్‌వేను అందుబాటులోకి తెస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు కూర్చునేందుకు వీలుగా పాలరాతి గజబోను, గుడి ముందు నీటి ఫౌంటెన్‌లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సైతం నెలకొల్పుతున్నారు. అయితే, కొందరు స్వార్థపరులు ఆలయాన్ని సాకుగా చూపి అభివృద్ధిని అడ్డుకోవాలని, గుడిని తొలగిస్తున్నారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వీటిని నమ్మవద్దని ఆలయ కమిటీ స్పష్టం చేసింది.

పిల్లల ప్లే ఏరియాలు, సోలార్ లైటింగ్ సహా ప్రత్యేక ఆకర్షణలు

సున్నం చెరువు పరిసరాలు సరికొత్త పర్యాటక కేంద్రంగా మారబోతున్నాయి. విశాలమైన బండ్, నడవడానికి వీలుగా పాత్‌వే, మార్గమధ్యంలో రాతి కుర్చీలు, పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియాలు, పచ్చిక బైళ్లు, ఓపెన్ జిమ్‌లను హైడ్రా ఏర్పాటు చేస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువు చుట్టూ ఔషధ, సుగంధ మొక్కలతో పాటు పెద్ద చెట్లను నాటి, సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి ప్రత్యేకంగా బేబీ పాండ్, చెరువులో బోటింగ్ సౌకర్యం, చుట్టూ సోలార్ లైట్లు, రక్షణ కోసం పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. చెరువుకు ఆనుకుని ఉన్న సహజసిద్ధమైన కొండ ప్రాంతాన్ని కూడా పర్యాటకులను ఆకట్టుకునేలా సుందరీకరిస్తున్నారు.