
యుద్ధంపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో కొనసాగుతున్న మధ్యప్రాచ్య యుద్ధాన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైందని మసౌద్ పెజెష్కియాన్ అన్నారు. ప్రస్తుతం ఇరాన్ ‘శక్తి, గౌరవం’ ఉన్న స్థితిలో ఉందని.. ఈ సమయంలోనే యుద్ధానికి ముగింపు పలకడం మంచిదని వ్యాఖ్యానించారు.
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ పెజెష్కియాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ కీలకమైన హార్ముజ్ జలసంధిని పాక్షికంగా మూసివేసి ఉంచగా.. అమెరికా ఇరాన్పై నౌకాదళ నిర్బంధాన్ని కొనసాగిస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తగ్గలేదు.
వైద్యులతో జరిగిన సమావేశంలో పెజెష్కియాన్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మనం శక్తి, గౌరవం ఉన్న స్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు యుద్ధాన్ని ముగించడం మంచిది’’ అని పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం ఇరాన్ విజయాన్ని గుర్తిస్తోందని అన్నారు. అమెరికా పాఠశాలలు, ఆసుపత్రులు, మౌలిక వసతులపై దాడులు చేసిందని.. ఇవి అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు.
మరోవైపు ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్.. ఇరాన్పై ఇప్పటివరకు లేనంత కఠినమైన ఆంక్షలను విధించనున్నట్లు ప్రకటించారు. ఆర్థిక చర్యల ద్వారా ఇరాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా అమెరికా వ్యూహాన్ని మార్చుకుంటున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
అమెరికా చేపట్టబోయే ఈ చర్యలను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. వాటిని ‘ఆర్థిక ఉగ్రవాదం’గా అభివర్ణిస్తూ.. ఆంక్షలు విధించే వారిపై విచారణ, శిక్ష విధించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఇక ఇరాన్పై అమెరికా ప్రతిపాదిస్తున్న ఆర్థిక ఒత్తిడిపై చైనా కూడా స్పందించింది. ఆంక్షలు, ఒత్తిళ్లతో మధ్యప్రాచ్య సమస్య పరిష్కారం కాదని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సంబంధిత దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి రాజకీయ, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఇరాన్పై అమెరికా ప్రతిపాదిస్తున్న కొత్త ఆర్థిక చర్యలను ‘Economic D-Day’గా అభివర్ణిస్తున్నారు. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా విమర్శలు చేశారు. అమెరికాలో పెరుగుతున్న అప్పులు, వడ్డీ వ్యయాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
అమెరికా-ఇరాన్ వివాదంలో హార్ముజ్ జలసంధి కీలక అంశంగా మారింది. ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా తెరవడానికి ముందు అమెరికా దిగ్బంధం, చమురు ఆంక్షలు, స్తంభింపజేసిన ఆస్తులకు సంబంధించిన అంశాల్లో రాయితీలు కోరుతోంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్న సంకేతాలు ఇస్తుండగా.. మరోవైపు అమెరికా ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు ఎప్పుడు పునఃప్రారంభమవుతాయి, యుద్ధానికి ఎలాంటి ముగింపు లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.