Reading Time: < 1 minute
భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం మాయమైందా..? మాయం చేశారా? అసలేం జరిగింది?

పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరా స్వామి ఆలయం ప్రసిద్ధి చెందిన ఆలయం. ఆలయంలోని భ్రమరాంబ అమ్మవారి మెడలో ఉండాల్సిన మంగళసూత్రం, నానుతాడు మాయం అయ్యాయి. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటి దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగస్టు నెల 13వ తేదిన శ్రావణ మాసం మొదలైంది. మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. ఈ అలంకరణ రెండు రోజుల వరకూ తొలగించలేదు. సోమవారం అలంకరణ తీసివేశారు. ఆ తర్వాతే అమ్మవారి మెడలో ఉండాల్సిన మంగళసూత్రం, నాను తాడు మాయం అయినట్లు పూజారులు గుర్తించారు. దాదాపు పన్నెండు లక్షల రూపాయల విలువైన ఆభరణం మాయం కావటం కలకలం రేపింది. అర్చకులు ఈవో ద్రుష్టికి తీసుకెళ్లారు. అయతే అలంకరణ తొలగించే సమయంలో పొరపాటుకు తీసివేశారేమో అన్న అనుమానంతో అన్ని చోట్ల వెదికారు. కాని ఎక్కడా మంగళసూత్రం కనిపించలేదు. ఇక చేసేదేమీ లేక పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆలయంలో ప్రతి శుక్రవారం పూజారుల వంతు మారుతుంది. ఈ క్రమంలోనే అలంకరణ చేసిన పూజారుల వంతు అదే రోజు ముగియడం అలంకరణ తొలగించే సమయంలోనే మంగళసూత్రం మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సిసి కెమెరా విజువల్స్ ను జల్లెడ పడుతున్నారు. గతంలోనూ అమ్మవారి వడ్రాణంకు ఉండాల్సిన బంగారు లింకులు మాయమవ్వడంపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ తర్వాత వాటిని పూజారులే చేయించి ఇచ్చారు. అప్పుడు పోలీసుల కేసు నమోదు వరకూ వెళ్లకపోవడంతోనే మరోసారి చోరి జరిగిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అమ్మవారికున్న ఆభరణాల లెక్కలు తీయాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

మరొక వైపు ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. భక్తుల మనోభావాలతో ముడి పడిన అంశం కావడంతో ఎవరైనా దొంగలించరా? లేక చేతివాటం ప్రదర్శించారా? అన్నది తేలాల్సి ఉంది. పోలీసులు ప్రస్తుతం ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు.