Reading Time: 3 minutes

ఐ ఫోన్ కోసం ప్రాణం తీసుకోవడమా! ఈ పిల్లోడే ఇలా ఉన్నాడా అందరి ప్రవర్తన ఇలాగే ఉందా..? పేరెంట్స్కు వేకప్ కాల్!

Caption of Image.

ప్రాణం విలువ ఎంతుంటుంది.. ఐఫోన్ అంత ఉంటుందా..? అంతకంటే తక్కువేనా..? ఏమో ఈ తరం దృష్టిలో అలానే ఉన్నట్లుంది. ఒకవేళ ప్రాణానికి వెల కడితే ఐఫోనే ఎక్కువ అనేలా ఉంది ఈ జెనరేషన్. లేకపోతే.. ఫోన్ కోసం ప్రాణాలు తీసుకోవడమేంటి..? ఫోన్ ఇప్పుడు కాకుంటే నాలుగు రోజుల తర్వాత కొనొచ్చు.. కానీ ప్రాణం ఇప్పుడు తీసుకొని మళ్లీ నాలుగు రోజుల తర్వాత తెచ్చుకోగలమా..? ఐ ఫోన్ కొనివ్వలేదని సూసైడ్ చేసుకోబోయి.. తనతో పాటు తన పేరెంట్స్ చావుకు కారణమైన యువకుడి మానసిక స్థితి.. ఈ తరం మెంటల్ కండిషన్ కు అద్ధం పడుతోంది. దేశం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచేసిన ఈ ఘటన గురించిన వివరాలిలా ఉన్నాయి. 

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జరిగింది ఈ విషాద ఘటన. తిస్‌గావ్ ప్రాంతంలో ఉన్న ఖావ్‌డ్యా డోంగర్ దగ్గర 2026 ఆగస్టు 21 ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఐ ఫోన్ కోసం సూసైడ్ ఏంటి.. చివరికి పేరెంట్స్ చావుకు కారణమైన ఈ యువకుడు ఎంత పనిచేశాడని సోషల్ మీడియా అంతా వైరల్ చేస్తున్నారు ఈ వార్తను. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. దేవ్‌లై-సతారా ప్రాంతానికి చెందిన మురళీధర్ చంద్వాడే, తల్లి సంగీత చంద్వాడేల కొడుకు కునాల్ మురళీధర్ చంద్వాడే (18) ఐఫోన్ కోసం ఆత్మహత్యా యత్నం చేసి చివరికి తనతో పాటుతన పేరెంట్స్ చావుకూ కారణమయ్యాడు. కొండపై నుంచి దూకి చనిపోతానని బెదిరిస్తున్న కొడుకును కాపాడబోయి పాపం ఆ తల్లిదండ్రులు కూడా ప్రాణాలు వదలాల్సివచ్చింది. 

తల్లిదండ్రుల పేదరికం.. ఆకాశంలో కొడుకు ఆశలు:

కొడుకు చదువు, ఇంటి ఖర్చు, భవిష్యత్ అవసరాలు, సొంతింటి కల.. ఇలాంటి ఒత్తిడిలో ఆ కుటుంబం బతుకీడుస్తోంది. తండ్రి మురళీధర్ చంద్వాడే డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే జల్సాలకు, రిచ్ లైఫ్ ఊహలకు అలవాటుపడిన కొడుకు కునాల్.. తల్లిదండ్రుల ఆర్థిక స్థితి గురించి ఏనాడు ఆలోచించలేదు. ఐఫోన్ మోజులో పడి పేరెంట్స్ ను టార్చర్ చేయడం మొదలు పెట్టాడు నాకు ఐ ఫోన్ కొనిస్తారా లేదా అంటూ రోజూ ఒకటే లొల్లి. డబ్బులు వచ్చాక కొనిస్తా.. ఇప్పుడు లేవు నాన్నా.. అంటూ సర్దిచెప్పుతూ కొనే స్థోమత లేక.. కొడుకును సముదాయించలేక సతమతం అవుతూ వస్తున్నారు ఆ తల్లిదండ్రులు.  ఫోన్ కొనివ్వకుంటే చనిపోతానని బెదిరించడం మొదలుపెట్టాడు.

వైరల్ అవుతున్న వీడియో:

ఐఫోన్ కొనిస్తారా లేదా అంటూ పోరు పెడుతూ వస్తున్న కునాల్.. ఫోన్ కొనివ్వకుంటే చనిపోతానని బెదిరించి..  ఉదయం 10 గంటల ప్రాంతంలో ఖావ్‌డ్యా కొండ దగ్గరకు చేరుకున్నాడు. కొడుకు నిజంగానే ఏమైనా చేసుకుంటాడా అని పరుగెత్తుకుంటూ వచ్చారు ఆ అమాయక తల్లిదండ్రులు. విషయం తెలిసిన స్థానికులు కూడా అక్కడికి చేరుకుని సముదాయంచే ప్రయత్నం చేశారు.

పేరెంట్స్, స్థానికులు ఎంత చెప్పినా వినకుండా ఫోన్ కొనివ్వకుంటే చనిపోతానని కొండ అంచుకు వెళ్లాడు మొండిపట్టు పట్టిన కునాల్. ఇంతలో పోలీసులు, రెస్క్యూ టీమ్ కూడా అక్కడికి చేరుకున్నాయి. వీళ్లు ఎంత మంది చెప్పినా పిచ్చి పట్టినట్లు ఫోన్ జపం చేస్తున్న కునాల్ వినిపించుకోలేదు. అందరూ కలిసి సుమారు మూడు నాలుగు గంటల పాటు కునాల్‌ను చనిపోవాలనే నిర్ణయం విరమించుకునేలా ఒప్పించడానికి ప్రయత్నించారు. ఇంటికి వెళ్దాం.. తర్వాత కొనిస్తాలే అని చెప్పి ఏడుస్తూ, బామాలుతూ ఒప్పించే ప్రయత్నం చేశాడు. కునాల్ ఎవరు ఎంత చెప్పినా ఎవరి మాటలను పట్టించుకోలేదు. కొండ అంచున నిలబడి చచ్చిపోతానని చివరికి అన్నంత పని చేశాడు.

చనిపోతానని దూకే ప్రయత్నం చేస్తున్న కొడుకును మురళీధర్  పట్టుకునే ప్రయత్నంలో అతని వైపు వెళ్లాడు.  కునాల్‌కు దగ్గరగా వెళ్లాడు. కానీ కునాల్ ఇంతలోనే కొండ పై నుంచి దూకేశాడు. అతనిని కాపాడే ప్రయత్నంలో మురళీధర్ కూడా బ్యాలెన్స్ కోల్పోయి, తన కొడుకుతో పాటు లోయలో పడిపోయారు. కింద పడటం వల్ల ఇద్దరూ స్పాట్లోనే చనిపోయారు. అది చూసిన తల్లి సంగీత భర్త కొడుకు పడిపోవడాన్ని తట్టుకోలేక షాక్ తో వెంటనే దూకేసింది. దీంతో ఆమె కూడా స్పాట్ లోనే చనిపోయింది. కుటుంబం మొత్తం ఇలా కొండపై నుంచి కింద పడి చనిపోవడంతో అక్కడ ఉన్న వాళ్లంతా షాక్లోకి వెళ్లిపోయారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెంపకంలో లోపమా.. సామాజిక ప్రభావమా..?

ఈ ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిందనే చెప్పాలి. ఐఫోన్ కోసం చనిపోవడమేంటి..? కాపాడబోయి తల్లిదండ్రులు చనిపోవాల్సిన కర్మేంటి..? అని ఈ ఘటన చూసిన వాళ్లకు కళ్లలో నీళ్లు ఆగలేదు. అయితే ఈ ఘటనపై పలు రకాలుగా చర్చిస్తున్నారు. కొడుకును పెంపకంలో తల్లిదండ్రుల లోపమా.. లేక సామాజిక ప్రభావంతో కునాల్ అలా తయారయ్యాడా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. 

ఇంట్లో పరిస్థితులు చెప్పి, అన్ని బుద్దులు చెప్పినా పిల్లల పెరిగే విధానంపై స్నేహితులు, సోషల్ మీడియా, సినిమా ప్రభావం చూపిస్తున్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై సమాజంలో లోతైన చర్చ జరగాల్సి ఉందని.. ప్రభుత్వాలు పిల్లల మానసిక ప్రవర్తనను ప్రభావితం చేసే అంశాలను కట్టడి చేసేలా చిన్ననాటి నుంచే చదువు ద్వారా మానసిక పరివర్తనకు సంబంధించిన అంశాలను విద్యాబోధనలో చేర్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 

©️ VIL Media Pvt Ltd.