
హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్య నగర్లో శనివారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. కేవలం 50 గజాల స్వల్ప స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఒక ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిర్మాణంలో ఉన్న ఈ భవనం పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్పై పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
బిల్డర్ అత్యాశే కారణం.. పక్క భవనాలు పాక్షికంగా ధ్వంసం
మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్య నగర్లో నిబంధనలకు విరుద్ధంగా, అతి తక్కువ స్థలంలో యజమాని, బిల్డర్లు కలిసి ఏడు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ భవనం ఒక్కసారిగా పక్కకు వాలిపోయి, సమీపంలోని వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్పై కుప్పకూలింది. ఈ ధాటికి ఆ అపార్ట్మెంట్ సైతం పాక్షికంగా దెబ్బతింది. ప్రమాద తీవ్రతకు పక్కనే ఉన్న హాస్టల్లోని విద్యార్థులు, నివాసితులు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా?
కూలిన భవనంలో ప్రమాద సమయంలో పనిచేసే కార్మికులు గానీ, ఇతరులు గానీ ఉన్నారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తూ, ఆ ప్రాంతంలో సహాయక చర్యలను వేగవంతం చేశారు.