
ENG vs PAK: ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు నమోదు అయింది. టెస్టు మ్యాచ్లో ప్రత్యర్థి జట్టుకు చెందిన అన్ని 20 వికెట్లను కేవలం పేస్ బౌలర్లు మాత్రమే తీయడం గత 25 ఏళ్లలో ఇది మొదటిసారి. సరిగ్గా 2001లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులో ఇంగ్లండ్ పేసర్లు కాడిక్, గఫ్, కార్క్ కలిసి పాకిస్థాన్కు చెందిన 20 వికెట్లను నేలకూల్చారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత జోఫ్రా ఆర్చర్, ఆలీ రాబిన్సన్, జోష్ టంగ్ త్రయం అదే సీన్ను రిపీట్ చేస్తూ పాక్ బ్యాటింగ్ లైనప్ను కోలుకోలేని దెబ్బ తీశారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో విఫలమవ్వగా, ఇంగ్లండ్ తన మొదటి ఇన్నింగ్స్లో 409 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్కు 238 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ను ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో కట్టడి చేశారు. కేవలం 37.3 ఓవర్లలోనే 135 పరుగులకు పాక్ రెండో ఇన్నింగ్స్ సమాప్తమైంది. జోఫ్రా ఆర్చర్ కొత్త బంతితో ఓపెనర్లను అవుట్ చేయగా, ఆలీ రాబిన్సన్, జోష్ టంగ్ మిగతా వికెట్లను పంచుకుని మ్యాచ్ను మూడో రోజే ముగించారు.
గత దశాబ్ద కాలంలో లీడ్స్లోని హీడింగ్లీ మైదానం ఇంగ్లండ్కు అజేయమైన కోటగా మారింది. ఈ మైదానంలో ఆడిన గత తొమ్మిది టెస్టుల్లో ఇంగ్లండ్కు ఇది ఎనిమిదో విజయం కావడం విశేషం. అందులోనూ నాలుగు విజయాలు ఇన్నింగ్స్ తేడాతో రాగా, అవన్నీ ఆసియా జట్లపైనే నమోదు కావడం గమనార్హం. పాకిస్థాన్పై రెండుసార్లు, భారత్, శ్రీలంకలపై తలోసారి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ విజయాలు సాధించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు గురువారం నుంచి లార్డ్స్లో ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ పేసర్ల దాటికి పాకిస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి పూర్తిగా చేతులెత్తేసింది. రాబోయే లార్డ్స్ టెస్టులోనైనా పాక్ కోలుకుని పుంజుకుంటుందో లేదో వేచి చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..