Reading Time: < 1 minute
Onion Price Hike Onion Rates Soar To Rs 70 Per Kg In Kakinada

Onion Price Hike: ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలకు వంటింటి ఖర్చులు భారంగా మారుతున్నాయి. కాకినాడ రైతు బజార్లలో కిలో ఉల్లి ధర రూ.49కు చేరగా.. బయట మార్కెట్లలో మాత్రం కిలోకు రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల కిలోకు రూ.80 కూడా అమ్ముతున్నారు. ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరగడంతో.. వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మార్కెట్లలో ధరలను పర్యవేక్షించి.. అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మహారాష్ట్ర నుంచి కాకినాడకు ఉల్లి సరఫరా తగ్గిపోవడంతో హోల్‌సేల్‌ ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు కర్నూలు నుంచి కూడా మార్కెట్‌కు ఆశించిన స్థాయిలో ఉల్లి రావడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. సరఫరా తగ్గడం, డిమాండ్‌ కొనసాగడంతో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని అంటున్నారు. కాకినాడ గాంధీనగర్‌ రైతు బజార్‌లో నిర్దేశించిన ధరల కంటే ఎక్కువగా కొందరు వ్యాపారులు ఉల్లిని విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ధరలకు ఉల్లి కొనుగోలు చేయాలని భావించిన వినియోగదారులకు కూడా అదనపు ధరలు భారంగా మారుతున్నాయి.

ఉల్లి ధరలు పెరుగుతుండటంపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరమైన ఉల్లిని కిలోకు రూ.60, రూ.70 చెల్లించి కొనుగోలు చేయడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ధరలు ఇదే విధంగా కొనసాగితే.. మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరింత ఆర్థిక భారం పడుతుందని అంటున్నారు. ఉల్లి ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లపై కూడా ప్రభావం పడుతోంది. వంటల తయారీలో ఉల్లి వినియోగం ఎక్కువగా ఉండటంతో ముడిసరుకు ఖర్చు పెరిగిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల ఆహార పదార్థాల ధరలను కూడా పెంచారు.