Reading Time: < 1 minute
Telangana Andhra Pradesh Rain Alert August 23 To 26 Heavy Rains

Rain Alert: ఒడిశాపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి క్రమంగా అక్కడక్కడే తిరుగుతూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికితోడు నైరుతీ రుతుపవనాలు కూడా బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాలు కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, బెల్లంపల్లి, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

హైదరాబాద్‌ నగరం, పరిసర ప్రాంతాలైన సైబరాబాద్, గచ్చిబౌలి, మియాపూర్, కొండాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు కుండపోతగా వర్షం దంచికొట్టింది. రాత్రి సమయంలోనూ వర్షాలు కొనసాగుతూ గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో పాటు 20-35 మిమీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. భారీ వర్షాల వల్ల రహదారులపై నీరు నిలిచే ప్రమాదం ఉన్నందున వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, వాతావరణం అస్థిరంగా ఉంటూ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాయలసీమలో మాత్రం మేఘావృతమై పొడి వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, ఏపీలో గరిష్ఠంగా 35 డిగ్రీల సెల్సియస్ నమోదుకాగా, గాలిలో తేమ శాతం తెలంగాణలో 75-92, ఏపీలో 60-80 శాతం మధ్య ఉంటోంది.