Reading Time: 2 minutes

Off The Record: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే ఆ జిల్లాలోని కూటమిలో చిచ్చు మొదలైందట. పదవుల పంపకం ఇంకా ఖరారు కాకముందే కూటమి పార్టీ నేతల మధ్య రచ్చ జరుగుతోందట. మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లాంటి పదవుల విషయంలో టీడీపీ, జనసేన నేతలు రోడ్డెక్కే పరిస్థితులు ఏర్పడ్డాయట. జనసేనలో మొదలైన రచ్చ జిల్లా అంతా పాకుతుందేమోననే ఆందోళన కూటమిలోని ఇతర నేతల్లో కనిపిస్తోందట. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమినేతల మధ్య స్థానిక సంస్థల ఎన్నికల అగ్గి రాజుకుందట. సీట్లు ఖరారు కాకముందే ఎవరికివారు కర్చీఫ్‌లు కాదు రగ్గులు, దుప్పట్లే వేసుకుని సీట్‌ కన్‌ఫమ్‌ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. మచిలీపట్నంలో మేయర్ అభ్యర్థి అంశం స్థానికంగా కూటమి నేతల్లో రచ్చగా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండే కార్పొరేషన్లు ఉన్నాయి. ఒకటి విజయవాడ, రెండోది మచిలీపట్నం. మచిలీపట్నం జనసేన ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు బండి రామకృష్ణ. జనసేన శ్రేణులు ఒక సమావేశం పెట్టి మచిలీపట్నం మేయర్‌ అభ్యర్థిగా బండి రామకృష్ణ పేరు ప్రతిపాదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశాయి. మచిలీపట్నం మేయర్‌ కూటమి అభ్యర్థి బండి రామకృష్ణకు ముందస్తు శుభాకాంక్షలు అంటూ జనసేన సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపుల్లోనూ వైరల్‌ చేస్తున్నారు.

దీనిపై జనసేనకే చెందిన కొట్టె వెంకట్రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ఆవేదన వెళ్లగక్కారు. తనను మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తామని హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకొని ఇప్పుడు బండి రామకృష్ణను మేయర్‌ అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయటంపై కొట్టె వెంకట్రావు రగిలిపోతున్నారట. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెబుతున్నారు. అధిష్టానం చెప్పకుండా ఏ విధంగా మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తారని ఆయన నిలదీస్తున్నారు. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర మంత్రిగా ఉన్నారు. మచిలీపట్నం ఎంపీగా జనసేనకు చెందిన బాలశౌరి ఉన్నారు. వీళ్లంతా చర్చించి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి..? మేయర్ స్థానం ఎవరికి ఇవ్వాలి..? అనేది నిర్ణయించాల్సి ఉంటుంది. అలాంటిదేమీ లేకుండా జనసేన శ్రేణులు సమావేశం పెట్టుకొని బండి రామకృష్ణను మేయర్ అభ్యర్థిగా ఏకగ్రీవ తీర్మానం చేయటంపై అధిష్టానం కూడా సీరియస్‌గా ఉందట. ఇలా చేయటం వల్ల కూటమిలో కుమ్ములాటలు మొదలవుతాయని జనసేన అధిష్టానం భావిస్తోందట. మరోవైపు ఈ పరిణామాలను టీడీపీ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారట.

ఇక విజయవాడ మేయర్‌ పీఠంపై సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ కన్నేశారట. తన కొడుకు సిద్ధార్థకు అవకాశం దక్కేలా అధిష్టానం దగ్గర పావులు కలుపుతున్నారనే చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో జనసేన నుంచి అమ్మిశెట్టి వాసు కూడా తన ప్రయత్నాలు చేస్తున్నారట. ఎన్టీఆర్ జిల్లాలో జనసేనకు ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా లేరు. ఆ లోటును మేయర్ ద్వారా భర్తీ చేయాలని జనసేన భావిస్తోందట. మరోవైపు టీడీపీ నుంచి కూడా అనేకమంది సీనియర్ లీడర్లు మేయర్ కుర్చీ కోసం పావులు కదుపుతున్నారట. కూటమి పెద్దలు మాత్రం సీట్లు పదవులు కేటాయింపుపై అధిష్టానం నిర్ణయం తీసుకునే వరకు నోరు మెదపవద్దని ఆదేశాలు జారీ చేశారట. మచిలీపట్నం వ్యవహారం రచ్చగా మారటంతో రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎవరు పదవుల విషయంలో నోరు విప్పకుండా కఠిన ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది.