
Gachibowli Illegal Buildings: గచ్చిబౌలి అంజయ్యనగర్లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనతో బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ నిర్మాణాల దందా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అధికారులు, అతను నిర్మించిన భవనాలన్నీ పూర్తిస్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా సాగిన అక్రమ నిర్మాణాలని తేల్చిచెప్పారు. గతంలో ఓ సాధారణ మెకానిక్గా జీవితాన్ని ప్రారంభించిన సాజిద్ ఖాన్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతో సైబరాబాద్ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల సామ్రాజ్యాన్నే సృష్టించాడు. అత్యంత చిన్న స్థలాలను కొనుగోలు చేసి, అధికారులకు లంచాలు ఎరవేస్తూ పరిమితికి మించిన అంతస్తులను నిర్మించాడు. వాటిని పీజీ హాస్టళ్లుగా మర్చి, అమాయక విద్యార్థులు, ఉద్యోగుల నుంచి భారీగా అద్దెలు వసూలు చేస్తూ అనతికాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించాడు.
బిల్డర్ సాజిద్ అక్రమాలపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఉన్నాయని హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ పరిధిలో సాజిద్ నిర్మించిన అన్ని అక్రమ కట్టడాలపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు, అతని అక్రమ వ్యాపారానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల జాబితాను కూడా మున్సిపల్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అక్రమార్కులతో చేతులు కలిపిన అధికారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇక మరోవైపు, ప్రమాద స్థలంలో శిథిలాల తొలగింపు ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం నేలమట్టం అయిన బిల్డింగ్ శిథిలాలు తొలగించిన తర్వాత వెనక ఉన్న అక్రమ కట్టడం G+6 భవనం కూల్చివేయనున్నారు. ఇప్పటికే జయదర్శిని అపార్ట్ మెంట్ C బ్లాక్ వాసులు ఖాళీ చేసి వెళ్లిపోయారు. బిల్డింగ్ యజమాని సాజిద్ పరారీలో ఉన్నాడు. ఇప్పటికే సాజిద్పై కేసు నమోదు చేశారు.