
Telangana Weather: ఆగస్టు నెల ప్రారంభమైనప్పటి నుంచి వాతావరణ శాఖ తొలిసారి తెలంగాణకు భారీ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగస్ట్ మాసంలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 6 సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీనివల్ల 18 శాతం వర్షపాత లోటు ఏర్పడగా, తాజాగా పడుతున్న వర్షాలతో ఉపశమనం లభించనుంది.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక రాజధాని హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆగస్ట్ నెలలో రాష్ట్రానికి ఇవే తొలి హెచ్చరికలు కావడంతో వాతావరణంలో వస్తున్న మార్పుల పట్ల ప్రజలు, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.