
తమిళనాడు వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేంద్ర ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్లు, అభ్యంతరాలను వ్యక్తం చేశారు. నీట్, ప్రతిపాదిత డీలిమిటేషన్, దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థిక న్యాయం, కావేరీ జలాలపై తమిళనాడు హక్కులు వంటి అంశాలను ప్రస్తావించారు.
నీట్ను వ్యతిరేకించిన విజయ్
ఇటీవల నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనలు జరుగుతున్న వేళ.. విజయ్ మరోసారి తమిళనాడు ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. నీట్ కారణంగా గ్రామీణ ప్రాంతాలు, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారని.. గ్రామీణ ప్రాంతాలు, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నీట్ ప్రతికూలంగా మారుతోందని తెలిపారు. పాఠశాల విద్య ఆధారంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే తమిళనాడు విధానాన్ని ఇది దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. తమిళనాడు కోటాలోని MBBS, BDS, AYUSH కోర్సుల సీట్లన్నింటినీ కేవలం 12వ తరగతి మార్కుల ఆధారంగా భర్తీ చేసుకునేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరారు.

ఇక ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియపైనా విజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణలో విజయవంతమైన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గించడం ఒక రకంగా శిక్షించినట్లేనని అన్నారు. అలాగే సమావేశంలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కూడా పాల్గొన్న నేపథ్యంలో.. తమిళనాడుకు సంబంధించిన కావేరీ జలాల అంశాన్ని విజయ్ ప్రస్తావించారు. కావేరీ వంటి నదుల దిగువ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలు, నదీ ప్రవాహాలపై ఆధారపడిన ప్రజల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పులు, ట్రైబ్యునల్ అవార్డులు, నదీ జలాల నిర్వహణకు సంబంధించిన చట్టపరమైన వ్యవస్థలను అక్షరాలా అమలు చేయాలని కోరారు.
‘ఆర్థిక న్యాయం’ కావాలి
రాబోయే ఫైనాన్స్ కమిషన్ను దృష్టిలో పెట్టుకుని దక్షిణాది రాష్ట్రాలకు సమానమైన ఆర్థిక న్యాయం చేయాలని విజయ్ డిమాండ్ చేశారు. అభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ, జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు నష్టపోకుండా ఆర్థిక వనరుల పంపిణీ విధానం ఉండాలని అన్నారు. ‘‘దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేకమైన ప్రాధాన్యం కోరడం లేదు. న్యాయమైన, సమానమైన వ్యవహారాన్ని మాత్రమే కోరుతున్నాయి’’ అని విజయ్ స్పష్టం చేశారు.
దక్షిణాది ప్రాంతీయ మండలిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాలు సభ్యులుగా ఉన్నాయి. సమావేశానికి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, సీనియర్ ప్రతినిధులు హాజరయ్యారు. తమిళనాడులోని మహాబలిపురంలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. దక్షిణాది ప్రాంతీయ మండలికి అమిత్ షా చైర్మన్గా వ్యవహరిస్తుండగా.. తమిళనాడు సీఎం విజయ్ వైస్ చైర్మన్గా ఉన్నారు.