Reading Time: 2 minutes
Telangana Ration Rice Illegal Sale Card Cancellation Warning

పేదవాడి కడుపు నింపాలనే సంకల్పంతో ప్రభుత్వాలు రూపాయి ఖర్చుకు వెనుకాడకుండా ఉచితంగా బియ్యం ఇస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లబ్ధి అక్రమార్కుల పాలిట ‘కాసుల పంట’గా మారుతోంది. రూపాయి లేకపోయినా పేదవాడు ఆకలితో అలమటించకూడదని ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం అందిస్తుంటే, ఆ పథకం ఆశయం కాస్తా దారి మళ్లుతోంది. ఉచిత బియ్యం అర్హులైన పేదల కడుపు నింపాల్సింది పోయి, బ్లాక్ మార్కెట్ వ్యాపారుల జేబులు నింపుతుండటం తీవ్ర విచారకరం.

తినడానికి ఇచ్చే బియ్యం.. గడప దాటక ముందే విక్రయం..
ఈ రోజుల్లో చాలా చోట్ల రేషన్ కార్డు ఉండి, రేషన్ బియ్యాన్ని ఆహారంగా వాడుకోని వర్గాలు దాన్ని ఒక అదనపు ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నాయి. ప్రతి నెల లేదా మూడు నెలల కోటా పంపిణీ మొదలవగానే లబ్ధిదారుల ఇళ్ల ముందే దళారులు ప్రత్యక్షమవుతున్నారు. ప్రభుత్వం అందించిన నాణ్యమైన బియ్యాన్ని ఇంట్లో ఉంచుకోవాల్సిన పేదలు, కేవలం ఐదు-పది రూపాయల ఆశకు లోనై వ్యాపారులకు అమ్మేస్తున్నారు. మరికొన్ని చోట్ల దందా ఇంకొంచెం ముందుకెళ్లింది. అసలు బియ్యం సంచులను ఇళ్లకు కూడా తీసుకెళ్లడం లేదు. షాపు వద్దకు వెళ్లి వేలిముద్ర వేసి, బియ్యాన్ని అక్కడ వదిలేసి, కిలోకు రూ.10 నుండి రూ.15 తీసుకుని వెళ్లిపోతున్నారు.

ఈ విధంగా మిగిలిపోయిన బియ్యాన్ని రేషన్ డీలర్లు, దళారులు చీకటి పడగానే గోదాములకు, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇంకొన్ని రేషన్ షాపుల్లో డీలర్లు స్థానిక హోటళ్లకు అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా.. బహిరంగ మార్కెట్లో వీటిని కేజీకి రూ.20 నుండి రూ.25 వరకు విక్రయిస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్నారు. పేదవాడి ఆకలి తీర్చాలనే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం ఇక్కడ తీవ్రంగా నీరుగారిపోతోంది.

ఈ దందాను అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు కఠినతరం చేశారు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే సన్నబియ్యాన్ని బయట మార్కెట్లో అమ్మినా, కొనుగోలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని వరంగల్ జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య హెచ్చరించారు. లబ్ధిదారులు బియ్యం అమ్ముకున్నట్లు ఆధారాలతో సహా నిరూపణ అయితే వారి రేషన్ కార్డును శాశ్వతంగా రద్దు చేస్తారు. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని వారిని అనర్హులుగా గుర్తించి జాబితా నుంచి తొలగిస్తారు. ఆకస్మిక తనిఖీల్లో బియ్యం నిల్వల్లో తేడాలు వచ్చినా, రీసైక్లింగ్ దందాలో భాగస్వామ్యమైనా డీలర్ల లైసెన్సులను రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఉచితంగా అందిస్తున్న ఆహార ధాన్యాలను కేవలం ఆకలి తీర్చుకోవడానికే ఉపయోగించాలి. వ్యాపార వస్తువుగా మార్చి చట్టపరమైన సమస్యల్లో చిక్కుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.